అమ్మప్రేమకు హద్దేది.. బిడ్డ కోసం ఈ కన్నతల్లి చేసిన త్యాగం కంటతడిపెట్టిస్తోంది..!
తల్లిప్రేమ… ఈ విశ్వంలో దేనితో వెల కట్టలేనిది. ఈ విషయం తాజాగా మర్కాపురం బస్సు ప్రమాదంలో మరోసారి నిరూపితమయ్యింది. ఓ తల్లి తన బిడ్డను కాాపాడుకునేందుకు ప్రాణత్యాగం చేసింది.

బిడ్డ కోసం తల్లి ప్రాణత్యాగం..
AP Bus Accident : ఏ తల్లి అయినా తన ప్రాణాలకు తెగించి బిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఈ తల్లి మాత్రం నవమాసాలు మోసి ఓసారి బిడ్డకు జన్మనిచ్చింది... ఇప్పుడు తన ప్రాణాలు బలిచ్చిమరీ మరోసారి బిడ్డకు పునర్జన్మ ఇచ్చింది ఇలా. అమ్మ ప్రేమకు ఆకాశమే హద్దు... ఆమె త్యాగాలకు సరిహద్దులు లేవని నిరూపించింది. ఆంధ్ర ప్రదేశ్ మార్కాపురంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో ఓ తల్లి కొడుకు ప్రాణాలు కాపాడేందుకు తాను బలయ్యింది. ఈ ఘటన తల్లికి బిడ్డలపై ఉండే అంతులేని ప్రేమను తెలియజేస్తోంది.
అసలు ఏం జరిగింది...?
నిన్న (మార్చి 26, గురువారం) ఉదయం తెలంగాణ నుండి ఆంధ్ర ప్రదేశ్ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ లారీ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో బస్సంతా వ్యాపించింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే బస్సంతా మంటలు వ్యాపించాయి.
ఈ బస్సులోనే కనిగిరికి చెందిన ఉప్పు రమాదేవి(45) కొడుకు మనోహర్ తో కలిసి ప్రయాణిస్తోంది. బస్సు ప్రమాదానికి గురికాగానే రమాదేవి అప్రమత్తమయ్యారు. బస్సు కర్టెన్లకు మంటలు అంటుకోవడం... అవి వేగంగా వ్యాపిస్తుండటం గమనించిన ఆమె అనుకుంటే వెంటనే బస్సులోంచి దూకి తప్పించుకునేవారు. కానీ ఇందుకు తల్లిప్రేమ అడ్డు వచ్చింది. ముందు కొడుకు ప్రాణాలు కాపాడేందుకు ఆ తల్లి సిద్దమయ్యింది... మంటలు పూర్తిగా వ్యాపించి పొగ కమ్మేసి ఊపిరాడని పరిస్థితిలో కొడుకును కిటికిలోంచి బయటకు తోసేసింది. కొడుకు ప్రాణాలతో బైటపడ్డాడు కానీ అతడిని కాపాడేక్రమంలో ఆమె మంటల్లో చిక్కుకుంది. ఇలా రమాదేవి కొడుకుకోసం సజీవదహనం అయ్యింది.
తల్లిప్రేమకు నిలువెత్తు నిదర్శనం...
ఈ కలికాలంలో బిడ్డలను కని హాస్పిటల్లో వదిలివెళుతున్న తల్లులను చూస్తున్నాం. చివరకు తమ సుఖాల కోసం బిడ్డలను చంపిన తల్లుల గురించి విన్నాం. దీంతో నేటితరం తల్లుల ప్రేమపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ మార్కాపురం బస్సు ప్రమాదం మరోసారి తల్లిప్రేమకు అసలైన నిర్వచనం ఇచ్చింది. ప్రాణాలకు తెగించి బిడ్డకు జన్మనివ్వడమే కాదు పునర్జన్మ ఇచ్చింది ఈ తల్లి... అమ్మప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన. రమాదేవి త్యాగం చాలామందితో కంటతడి పెట్టిస్తోంది.
14కు చేరిన మార్కాపురం మృతుల సంఖ్య...
జగిత్యాల నుండి కనిగిరి వెళుతున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ గురువారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యింది. రాయవరం వద్ద కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడిక్కడే 13 మంది మరణించగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. దీంతో మృతుల సంఖ్య 14 కు చేరింది. ఇక గాయపడినవారిలో 11 మంంది మార్కాపురం ఏరియా ఆస్పత్రిలో, మరో 16 మంది ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
బస్సు మంటల్లో చిక్కుకుని మరణించివారి మృతదేహాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయి. దీంతో DNA ఆధారంగా మృతదేహాలను గుర్తిస్తున్నారు... ఇందుకోసం మృతుల కుటుంబసభ్యుల శాంపిల్స్ సేకరించారు. ప్రస్తుతం మృతదేహాలన్నీ విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్స్ గ్రేషియా..
మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. ఈ ఘటనగురించి తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయాలపాలైనవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.

