- Home
- Andhra Pradesh
- ఆంధ్రప్రదేశ్లోని ఈ చిన్న గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
ఆంధ్రప్రదేశ్లోని ఈ చిన్న గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
Andhra pradesh: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రంగానికి పెద్ద పీట వేస్తోంది. విశాఖపట్నం ఐటీ హబ్గా మారుతోంది. గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీ డేటా ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ చిన్న గ్రామం రూపురేఖలు మారనున్నాయి.

చిన్న గ్రామం నుంచి గ్లోబల్ టెక్ హబ్ దిశగా
ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి రాయపూర్ హైవే పక్కన ఉన్న చిన్న గ్రామం తర్లువాడ. ఇప్పటి వరకు పెద్దగా వినిపించని ఈ గ్రామం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న గూగుల్ సంస్థ ఇక్కడ భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో… తర్లువాడ పేరు రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. గ్రామీణ వాతావరణం, పంట పొలాలు, జీడిమామిడి తోటల మధ్య ఉన్న ఈ ప్రాంతం రానున్న కొన్నేళ్లలో మరో సైబరాబాద్ కావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి…
తర్లువాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 15 బిలియన్ డాలర్లు పెట్టుబడులు రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్నారు. 2026లో నిర్మాణ పనులు ప్రారంభం కావొచ్చని, 2030 నాటికి పూర్తి స్థాయిలో డేటా సెంటర్ పని చేయనుందని సమాచారం.ఈ ప్రాజెక్ట్ కోసం తర్లువాడలో 308 ఎకరాలు, అడవివరంలో 120 ఎకరాలు, రాంబిల్లిలో 160 ఎకరాల భూములు కేటాయించారు.
ఓవైపు ఉత్సాహం, మరోవైపు సందేహం
ఉన్నపలంగా తమ గ్రామానికి ఇంత పెద్ద కంపెనీ వస్తుండడంతో తర్లువాడ ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉద్యోగ అవకాశాలు, యువతకు భవిష్యత్తు, భూముల విలువ పెరుగుదల వంటి అంశాలు ఆశలను చిగురింపజేస్తున్నాయి. అయితే మరోవైపు అధిక నీటి వినియోగం, కాలుష్యం, పర్యావరణ ప్రభావం వంటి అంశాలపై ఆందోళన నెలకొంది. అయితే గూగుల్ సంస్థ పునరుత్పాదక ఇంధనంపైనే ఎక్కువ ఆధారపడతామని పర్యావరణానికి హాని తక్కువగా ఉండే విధానాలు అమలు చేస్తామని చెబుతోంది.
భారీగా పెరగనున్న భూముల ధరలు
డేటా సెంటర్ వార్త బయటకు రాగానే తర్లువాడ చుట్టుపక్కల భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో సెంటు భూమి రూ.3 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.7 నుంచి 8 లక్షల వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి కొంచెం దూరంగా ఉన్న భూములకు కోట్లలో డిమాండ్ వస్తోంది. భూముల విలువ భారీగా పెరుగుతున్నా రైతులు భూములు అమ్మడానికి ముందుకు రావడం లేదు. “ఇంకా విలువ పెరుగుతుంది” అన్న నమ్మకం బలంగా ఉంది.
మరో సైబరాబాద్ కానుందా.?
గూగుల్ డేటా సెంటర్తో పాటు మరికొన్ని డేటా సెంటర్లు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీటిలో ప్రధానంగా అదానీ డేటా సెంటర్, రిలయన్స్, సిఫీ టెక్నాలజీస్, ఏఆర్పీసీఎల్, టిల్మన్ గ్లోబల్ వంటి సంస్థలు ఉన్నాయి. వీటన్నింటి రాకతో ఈ ప్రాంతం మరో సైబరాబాద్ కావడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. డేటా సెంటర్ల రాకతో డేటా సెంటర్ ఇంజినీర్లు, నెట్వర్క్ టెక్నీషియన్లు, ఎలక్ట్రికల్, మెకానికల్ సిబ్బంది, సెక్యూరిటీ, లాజిస్టిక్స్ సిబ్బంది, ఐటీ సేవలకు అనుబంధ ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తాయి. దీంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వస్తాయి. ఇది పరోక్షంగా ఎంతో మందికి ఉద్యోగాన్ని కల్పిస్తాయని భావిస్తున్నారు.

