- Home
- Andhra Pradesh
- Andhra pradesh: మారనున్న ఏపీ భవితవ్యం.. ఈ ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు
Andhra pradesh: మారనున్న ఏపీ భవితవ్యం.. ఈ ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు
Andhra pradesh: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని మార్చనుంది. రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఏపీలో భారీగా పెట్టుబడులు రానున్నాయి.

ఏపీ ఖనిజ రంగానికి కేంద్ర బడ్జెట్ 2026-27 బిగ్ బూస్ట్
కేంద్ర బడ్జెట్ 2026-27లో ఖనిజ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉండటం రాష్ట్ర ఆర్థిక రంగానికి పెద్ద ఊతంగా మారనుంది. ఖనిజాల వినియోగం, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల సృష్టి దిశగా ఇది కీలక అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక రేర్ ఎర్త్ మైనింగ్ మిషన్తో ఏపీకి ఏమి లాభం?
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మిషన్ లక్ష్యం ఖనిజ వనరుల శాస్త్రీయ వినియోగం, సుస్థిర మైనింగ్ పద్ధతులు, ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణ. ఏపీలో ఈ మిషన్ అమలుతో మైనింగ్ కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా సాగనున్నాయి. దీనివల్ల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడటం, రాష్ట్రానికి అధిక ఆదాయం రావడం సాధ్యమవుతుంది.
ఆంధ్రప్రదేశ్లో లభిస్తున్న కీలక రేర్ ఎర్త్ మినరల్స్
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు ఖనిజ సంపదకు కేంద్రంగా నిలుస్తున్నాయి. నెల్లూరు తీర ప్రాంతంలో మోనాజైట్, ఇల్మెనైట్, రూటిల్, జిర్కాన్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి విలువైన ఖనిజాలు గుర్తించారు. మోనాజైట్లో అధిక శాతం రేర్ ఎర్త్ ఆక్సైడ్లు ఉండటం ప్రత్యేకత. అంతేకాదు థోరియం ఉనికితో అణుశక్తి రంగానికి కూడా ఇది కీలక వనరుగా మారనుంది.
అనంతపురం గుర్తింపు..
తీర ప్రాంతాలతో పాటు రాయలసీమ ప్రాంతం కూడా ఖనిజ మ్యాప్లోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. లాంథనమ్, సీరియం, నియోడైమియం, యిట్రియం, స్కాండియం, జిర్కోనియం వంటి లోహాలు ఆధునిక సాంకేతిక పరిశ్రమలకు కీలకం. దీని వల్ల ఇప్పటివరకు వెనుకబడిన జిల్లాల్లోనూ పరిశ్రమలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.
పరిశ్రమలు, ఉద్యోగాలతో గ్లోబల్ హబ్గా ఏపీ
రేర్ ఎర్త్ మినరల్స్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ రంగాలకు వెన్నెముక. ఈ ఖనిజాల ఆధారంగా ఏపీలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పడే అవకాశం ఉంది. దీని ఫలితంగా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టి కానున్నాయి. దిగుమతులపై ఆధారపడటం తగ్గి భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుంది.

