- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: ఏపీలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు.. గవర్నర్ ప్రసంగంతో తెరపైకి కీలక అంశం.
Andhra Pradesh: ఏపీలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు.. గవర్నర్ ప్రసంగంతో తెరపైకి కీలక అంశం.
సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసగించారు. ఇందులో భాగంగా ఆయన చేసిన ఓ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది..

ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీని ఇచ్చారని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ప్రజల కోరిక మేరకు ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొందన్న గవర్నర్, వైసీపీ పాలలో రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తోందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని.. అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఇద్దరు పిల్లలు ఉండాలన్న నిబంధన ఎత్తివేత..
గవర్నర్ స్పీచ్లో భాగంగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను ఎత్తి వేశామని తెలిపారు. గత డిసెంబర్లో ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను రద్దు చేసి, చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
అయితే కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి ఏపీ సమయంలో ఇద్దరికంటే ఎక్కువమంది సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా నిర్ణయిస్తూ చట్టం చేశారు. దీనిపై గత 30ఏళ్లుగా ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ నిబంధనను రద్దు చేసింది.
Chandra Babu
ఆంధ్రప్రదేశ్లో తగ్గుతోన్న జనాభా.
గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్తోన్న మాట ఎక్కువ మంది పిల్లల్ని కనమని. బాగా చదువుకున్న వారు పిల్లలను వద్దనుకుంటున్నారని కానీ ఇది సరైంది కాదని చంద్రబాబు పలుసార్లు తెలిపారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని లేకుంటే రోబోలతో పనిచేయించుకోవాల్సి వస్తుందని గతంలో పలుసార్లు తెలిపారు. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఇద్దరికి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి కూడా అవకాశం కల్పించారు.
అయితే సీఎం ఇలా చెప్పడం వెనకాల బలమైన కారణం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. కారణాలు ఏవైనా పిల్లలను కనడానికి పెద్దగా ఆసక్తిక చూపడం లేదని స్పష్టమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభ తగ్గుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2001లో 2.6శాతం ఉంటే 2024నాటికి అది 1.5శాతం మాత్రమే ఉంది.
జనాభా రేటు తగ్గితే ఏమవుతుంది.?
జనాభా రేటు తగ్గడం అనేది కేవలం రాజకీయ అంశమే కాకుండా సామాజిక సమస్యగా కూడా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనాభా రేటు తగ్గడం వల్ల పన్ను ఆదాయంలో కోతలు మొదలు ఎన్నో నష్టాలు ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి సైతం పిల్లల గురించి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కొత్త పెళ్లయిన జంటలు 16 మంది పిల్లల్ని కనాలంటూ ఆయన అన్న మాటలు తెగ వైరల్ అయ్యాయి.