- Home
- Andhra Pradesh
- Andhra pradesh: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ.. క్యూ కడుతోన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
Andhra pradesh: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ.. క్యూ కడుతోన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
Andhra pradesh: తెలుగులో రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ అంటే టక్కున గుర్తొచ్చేది హైదరాబాద్. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరో నగరం ఐటీ రంగానికి అడ్డాగా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగర నగరం ఐటీకీ కేరాఫ్గా మారుతోంది.

సాగరతీర నగరంలో ఐటీ విప్లవానికి శ్రీకారం
విశాఖపట్నం ఐటీ రంగంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోంది. సాగరతీర నగరంలో టెక్నాలజీ వెలుగులు వేగంగా విస్తరిస్తున్నాయి. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్తో పాటు మరో ఎనిమిది ఐటీ సంస్థల భూమి పూజ జరగడం కీలక పరిణామంగా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా శుక్రవారం శంకుస్థాపనలు జరిగాయి. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే మూడేళ్లలో భారీ స్థాయిలో ఉద్యోగాలు రానున్నాయి.
మౌలిక వసతులపై దృష్టి పెడితే విశాఖకు మరింత బలం
పెట్టుబడులు పెరుగుతున్న తరుణంలో విశాఖ మౌలిక వసతులు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. నగరంలో పార్కింగ్ సమస్యకు పరిష్కారం, ఆధునిక బస్స్టాప్లు, విశాల రహదారులు, కొత్త ఫ్లైఓవర్లు కీలకంగా మారాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా నగరాలకు కొత్త రైళ్ల ద్వారా కనెక్టివిటీ పెరగాలి. దువ్వాడ, గోపాలపట్నం రైల్వే స్టేషన్ల సామర్థ్యం పెంచాల్సిన అవసరం కూడా ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు విశాఖ విమానాశ్రయాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలో ఉంచాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
డేటా సెంటర్లు తెస్తున్న హైటెక్ అవకాశాలు
గూగుల్, మెటా, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేయడంతో విశాఖ హైస్పీడ్ డిజిటల్ హబ్గా మారే అవకాశం కనిపిస్తోంది. భూగర్భ సముద్ర కేబుల్స్, ల్యాండింగ్ స్టేషన్ల కారణంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం లభించనుంది. దీని వల్ల ఏఐ ఆధారిత స్టార్టప్లు, హైటెక్ ఇండస్ట్రీలు నగరాన్ని కేంద్రంగా చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ఐటీ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో స్థానిక యువతను సిద్ధం చేసుకునే దిశగా విశాఖ మారనుంది.
కాగ్నిజెంట్ క్యాంపస్తో గ్లోబల్ ఫోకస్
విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్కు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖ కేంద్రంగా మారుతుందని స్పష్టం చేశారు. నగరాన్ని ఎకనమిక్ రీజియన్ కింద అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాగ్నిజెంట్కు భారత్లో ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, పుణె, బెంగళూరు, కోల్కతాలో సెంటర్లు ఉన్నాయని గుర్తు చేశారు. హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్ అండ్ రిసోర్సెస్ రంగాల్లో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. భారత్ నుంచే దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండటం భారతీయుల సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ నుంచి గూగుల్ వరకూ
విశాఖపట్నం ఐటీ మ్యాప్లో వేగంగా ముందుకు వెళ్తోంది. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు దిశగా అడుగు వేసింది. ఎండాడ సమీపంలో 20 ఎకరాల కేటాయింపుపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఐటీ హిల్స్లో తాత్కాలికంగా కార్యకలాపాలు సాగుతున్న ఇన్ఫోసిస్ త్వరలో పూర్తి స్థాయి క్యాంపస్ నిర్మించాలని భావిస్తోంది. మరోవైపు గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిలయన్స్, సిఫీ డేటా సెంటర్లు కూడా రానున్నాయి. టీసీఎస్, యాక్సెంచర్ తాత్కాలిక క్యాంపస్లతో మొదలు పెట్టి శాశ్వత ఏర్పాట్ల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ పరిణామాలతో విశాఖపట్నం మరో హైటెక్ సిటీగా ఎదుగుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.

