- Home
- Andhra Pradesh
- Andhra pradesh: ఏపీలో 3 కొత్త జిల్లాలు.. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు ఖాయం
Andhra pradesh: ఏపీలో 3 కొత్త జిల్లాలు.. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు ఖాయం
Andhra pradesh: జిల్లాల పునర్విభజనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. కొత్తగా ఏయే జిల్లాలు వస్తున్నాయి.? దీంతో ఏం జరగనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీ జిల్లాల పునర్విభజనపై క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరనుంది. దీనికి సంబంధించి తుది గెజిట్ నోటిఫికేషన్ను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు.
మూడు కొత్త జిల్లాలు – మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం
కేబినెట్ నిర్ణయం ప్రకారం మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రాలుగా మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. తొలుత రెండు జిల్లాలకే పరిమితమవాలని భావించిన ప్రభుత్వం, మన్యం ప్రాంత ప్రజల విజ్ఞప్తుల నేపథ్యంలో రంపచోడవరం జిల్లాకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో గిరిజన ప్రాంతాలకు పరిపాలనా సేవలు మరింత చేరువ కానున్నాయి.
జిల్లాల సరిహద్దుల్లో కీలక మార్పులు
పునర్విభజనలో భాగంగా పలు నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లో కలపాలని మంత్రివర్గం నిర్ణయించింది.
* రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాలోకి మార్చారు.
* రాజంపేటను కడప జిల్లాలో విలీనం చేశారు.
* రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలిపారు.
* గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు మార్చారు
ఈ మార్పులు ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణలోకి తీసుకుని చేసినవేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కొత్త రెవెన్యూ డివిజన్లు, పరిపాలనా సౌలభ్యమే లక్ష్యం
జిల్లాల మార్పులతో పాటు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బనగానపల్లె, అడ్డరోడ్డు వంటి ప్రాంతాలను డివిజన్లుగా ప్రకటించారు. ఆదోనిని రెండు మండలాలుగా విభజించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరిపాలనా భారాన్ని తగ్గించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని మంత్రులు వెల్లడించారు. దీంతో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు, రియల్ ఎస్టేట్ బూమ్ ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రజా ప్రయోజనాలే ప్రాధాన్యం
మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయచోటి మార్పు తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందని, ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా కొనసాగించడం సాధ్యం కాదని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. 2025లో అనేక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, 2026లో మరింత వేగంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.

