ఆంధ్ర ప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ.. ఇక్కడ చదివితే లక్షల జీతంతో జాబ్ పక్కా..!
Artificial Intelligence University in AP : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాజధాని అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తోంది.. దీనివల్ల లాభాలేంటో తెలుసా?

ఏపీలో ఏఐ యూనివర్సిటీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... మరో టెక్నాలజీ విప్లవానికి నాంది పలుకుతోంది. ఇప్పుడు యావత్ ప్రపంచం ఏఐ వైపు చూస్తోంది... దీంతో ఎలాంటి అద్భుతాలు చేయాలనే ఆలోచనలోనే ప్రతి ఒక్కరు ఉన్నాయి. భవిష్యత్ ఈ ఏఐ టెక్నాలజీదే అని స్పష్టంగా అర్థమవుతోంది... అందుకే ఇండియాకు కూడా ఏఐ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేసేందుకు సిద్దమయ్యింది.
అయితే టెక్ సీఎంగా గుర్తింపుపొందిన నారా చంద్రబాబు నాయుడు ఏఐ విషయంలో చాలా ముందున్నారు. ఇప్పటికే ఆయన ఏఐపై కసరత్తు పూర్తిచేశారు... రాష్ట్రంలో ఏకంగా ఓ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సిద్దమయ్యారు. రాష్ట్ర యువతకు ఏఐతో పాటు క్వాంటమ్ ఏఐ కోర్సులను అందించేలా రాజధాని అమరావతిలో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇది దేశంలోనే మొట్టమొదటి ఏఐ యూనివర్సిటీ.
ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు జీవో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారో లేదో అప్పుడే పనులు మొదలయ్యాయి. అధికార యంత్రాంగం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి జీవో కూడా విడుదలచేసింది. అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగం. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్విడియా (NVIDIA) తో ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
ఫిబ్రవరి 19 నుండి ఈ ఏఐ యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అమరావతిలో ఈ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ఉంటుందని.. రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు సాగుతాయని తెలుస్తోంది. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుద్వారా యువతకు సరికొత్త ఉద్యోగ అవకాశాలకు దారులు తెరుస్తోంది ప్రభుత్వం.
ఏఐ యూనివర్సిటీలో యువతకు ఉద్యోగ అవకాశాలు
ఏఐ టెక్నాలజీని కొన్ని రంగాలకే పరిమితం చేయకుండా అన్ని రంగాల్లోనూ ఉపయోగించుకోవాలనేది చంద్రబాబు సర్కార్ ప్లాన్. అందుకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేలా ఏఐ యూనివర్సిటీని తీర్చిదిద్దుతున్నారు... మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండే కోర్సులను ఈ యూనివర్సిటీలో అందించనున్నారు. అంటే ఈ ఏఐ యూనివర్సిటీలో చదివితే యువతీయువకులకు బంగారు భవిష్యత్ ఉండేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.
అనేక రంగాల్లో ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని... దీంతో ఉద్యోగుల అవసరం తగ్గుతుందనే భయం ప్రజల్లో ఉంది. వేలల్లో కాదు లక్షల్లో ఉద్యోగాలు పోతాయని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయం గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. ఏఐతో ఉద్యోగాలు పోవడం కాదు... కొత్త ఉద్యోగాలు వస్తాయనే భరోసాను ఈ యూనివర్సిటీ ఇస్తుంది.
ఏఐ స్కిల్స్ ఉంటే లక్షల జీతం ఉద్యోగాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో కొత్తకొత్త ఉద్యోగాలు వస్తున్నాయి... కొన్నిరంగాల్లో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఏఐ అంటే అన్నీ టెక్నాలజీ సాయంతోనే జరగవు... ఆ టెక్నాలజీ ఏం చేయాలో నిర్ణయించేది మనుషులే. కాబట్టి ఏఐలో మంచి స్కిల్స్ సాధిస్తే లక్షల జీతంతో ఉద్యోగం పక్కా... ఇందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసే యూనివర్సిటీ ఉపయోగపడనుంది.
ఏఐ రాకతో జెనరేటివ్ ఏఐ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, ఎథికల్ హ్యాకింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫిన్ టెక్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో ఉద్యోగాలు పెరగనున్నాయి. అంటే ఏఐ టెక్ ఉద్యోగాలను తగ్గించదు కదా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయం, ఆరోగ్యంతో సహా ఇతర రంగాల్లోనూ ఏఐని ఉపయోగించనున్నారు.. కాబట్టి ఉద్యోగాలు పెరగనున్నాయి. ఇలా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుతో ఉద్యోగ భరోసా లభిస్తుంది.
రెండేళ్ళలో 10 మందికి శిక్షణ...
త్వరలోనే ప్రారంభంకానున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అతి తక్కువ సమయంలోనే వేలాదిమంది ఏఐ నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐని ఉపయోగం పెరిగే అవకాశాలున్న రంగాల్లో 10,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇలా రెండేళ్లలోనే యువత ఏఐతో ఓ ఆట ఆడుకునేలా తీర్చిదిద్దాలని... తద్వారా ఏపీని గ్లోబల్ ఏఐ హబ్ గా తీర్చిదిద్దాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.

