అజయ్ కల్లమ్ పై వైఎస్ జగన్ వేటు: అసలు జరిగింది ఇదీ...
నిన్నటివరకు అజయ్ కల్లాం సీఎంఓ లో సూపర్ బాస్. అత్యంత కీలక అధికారి. ఎన్నికల ముందు నుండి జగన్ వెన్నంటి ఉన్నందుకు, తండ్రి రాజశేఖర్ రెడ్డి వద్ద కూడా పని చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన రిటైర్ అయినప్పటికీ... ముఖ్యసలహాదారుగా నియమించుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన శాఖలన్నిటిని కోసేసి జగన్ షాక్ ఇచ్చాడు.
నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ పరిధిలోని కొందరి అధికారుల పరిపాలనా పరమైన బాధ్యతల కేటాయింపులలో మార్పులు జరిగాయి. మార్పులు జరగడం సహజమే కదా అని అనిపించొచ్చు. కానీ... అన్ని తామై ఇన్నిరోజులు సీఎంఓ లో చక్రం తిప్పినవారు ఇప్పుడు ఒక్కసారిగా తమ అధికారాలను కోల్పోయినట్టయింది. వారికి కేటాయించిన శాఖలన్నీ వేరేవారికి బదిలీ అయిపోయాయి.
ఆయనే అజయ్ కల్లాం . నిన్నటివరకు ఆయన సీఎంఓ లో సూపర్ బాస్. అత్యంత కీలక అధికారి. ఎన్నికల ముందు నుండి జగన్ వెన్నంటి ఉన్నందుకు, తండ్రి రాజశేఖర్ రెడ్డి వద్ద కూడా పని చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన రిటైర్ అయినప్పటికీ... ముఖ్యసలహాదారుగా నియమించుకున్నారు. నిన్న సీఎంవో సబ్జెక్ట్ ల జాబితాలో అజయ్ కల్లాం పేరు లేకుండా పోయింది. దీంతో ఆయన ఎలాంటి సబ్జెక్ట్ లు లేకుండా కేవలం సలహాదారుగా మిగిలిపోనున్నారు. సీఎంవోల బాధ్యతలు అన్నీ ప్రవీణ్ ప్రకాష్, సాల్మన్ ఆరోగ్యరాజ్, ధనుంజయ్ రెడ్డిల మధ్య పంపిణీ జరిగింది.
ఇప్పటివరకు మాజీ సీఎస్ అజయ్ కల్లాం సీఎంవోలో అత్యంత కీలకమైన హోం, రెవెన్యూ, ఫైనాన్స్ వంటి కీలక విభాగాల బాధ్యతలు పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఆయన పరిధిలో ఉన్న సబ్జెక్ట్ లు అన్నీ తప్పించేశారు. అజయ్ కల్లాంతో పాటు మరో రిటైర్డ్ అధికారి పీవీ రమేష్, జె. మురళీలది కూడా అదే పరిస్థితి. పీవీ రమేష్ కు తొలుత కీలక శాఖలు అప్పగించినా మధ్యలో కోత వేసి వైద్యం, విద్య వంటి శాఖలకు పరిమితం చేశారు. ఇప్పుడు సీఎంవో సబ్జెక్ట్ ల జాబితాలోనే ఆయన పేరు కూడా లేకుండా పోయింది.
అందుతున్న సమాచారం ప్రకారం సర్కార్ ఈ నిర్ణయం తీసుకొని వారి శాఖలకు కొత్త పెడుతున్న విషయం ఆర్డర్ కాపీ వచ్చే వరకూ అజయ్ కల్లాం, పీవీ రమేష్ కు కూడా తెలియదని చెబుతున్నారు. మొన్నటి వరకు సూపర్ బాస్ గా వెలుగొందారు. సీఎంఓ లో ఆయన మాటే శాసనం గా సాగింది. అలాంటి అజయ్ కల్లాం ఇప్పుడు శాఖా లేకుండా ఉండిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాల రూపకర్తగా కూడా అజయ్ కల్లాం కు పేరుంది. గ్రామ సచివాలయాల వ్యవస్థ వంటి వాటి విషయంలో కీలక పాత్ర పోషించారు అజయ్ కల్లాం.వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ఆయన జగన్ కి వెన్నుదన్నుగా ఉంటూ కీలక విషయాల్లో సలహాలిచ్చారు. అందుకోసమే జగన్ ఆయనను తెచ్చిపెట్టుకున్నారని అంటారు.
కోరితెచ్చిపెట్టుకున్న అజయ్ కల్లాం వంటి వారిని కూడా ఇలా సబ్జెక్ట్ లు లేకుండా చేయటం... అది కూడా పిలిచి ఓ మాట మాత్రంగా కూడా చెప్పకుండా చేశారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజయ్ కల్లాం వంటి సీనియర్ కి జగన్ ఈ స్థాయిలో షాక్ ఇవ్వడం ఎవరూ ఊహించని అంశం.
కొత్త ఆదేశాల ప్రకారం సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సాదారణ పరిపాలన శాఖతోపాటు హోం, రెవెన్యూ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, తో సహా అనేక కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రవీణ్ ప్రకాష్ తోపాటుగా సాల్మన్ ఆరోగ్యరాజ్, కె.. ధనుంజయ్ రెడ్డిలు కీలక అధికారులుగా అవతరించారు.
ఇక జగన్ మోహన్ రెడ్డి ఇలా ఎందుకు వ్యవహరించారు అని అందరూ చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం రిటైర్ అయిన అధికారులు కీలక ఫైళ్లపై సంతకాలు పెడితే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే వీరిని పక్కన పెడుతున్నట్లు చెబుతున్నాయి.కానీ ఈ వాదనలో మాత్రం పస కనిపించడంలేదు. సంవత్సరం నుంచి ఎదురవని అడ్డంకులు ఇప్పుడు ఎదురవుతున్నాయి అనేది ఇక్కడ అర్థమవడంలేదు.
సరే ఇప్పుడు ఎదురవుతున్నాయని అనుకుందాము.... రిటైర్ అయిన అధికారులు చాలా రాష్ట్రాల్లో సలహాదారులుగా నియమించుకుంటూనే ఉంటారు. ఒక విషయంపై పూర్తి పట్టున్న ఒక ప్రైవేట్ వ్యక్తిని ప్రభుత్వానికి సలహాలివ్వడానికి నియమించుకోవచ్చు.
మరో అంశం... ఈ సలహాదారులు ఎటువంటి కీలక ఫైల్స్ మీద కూడా సంతకాలు చేయరు. వీరు కేవలం సలహాదారులు మాత్రమే. తెలంగాణాలో నర్సింగరావు ను నియమించుకున్నారు కూడా. ఆయన విషయంలో ఎటువంటి ప్రతిబంధకాలు ఎదురవనప్పుడు అజయ్ కల్లాం విషయంలో ఎదురవుతాయనడం ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది.
కొన్ని రోజుల్ కిందటి వరకు రాష్ట్రంలో ఏదైనా విషయం గురించి జగన్ ను కలవాలనుకున్నప్పటికీ... అది అజయ్ కల్లాం ద్వారా మాత్రమే సాగేది. ఒకవేళ కలిసి ఏదైనా చెప్పాలనుకున్నప్పటికీ... కల్లాం అన్నకు చెప్పండి అనేవారు ముఖ్యమంత్రి జగన్. ఆయనతో పర్సనల్ రేలషన్ మైంటైన్ చేసేవారు జగన్. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఇలా పరిస్థితులు మారడానికి ప్రభుత్వ వర్గాల వాదన కాకుండా వేరే కారణాలు కనబడుతున్నాయి.
సమీపంలో ఎన్నికలు లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటున్నాయి. అందుకు కారణాలు అనేకం. కరోనా వైరస్ మహమ్మారి ఒకపక్కన దాని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ... కరోనా హీట్ కన్నా పొలిటికల్ హీట్ ఎక్కువవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత డైనమిక్ గా ఉంటున్నాయో..... రోజు జరుగుతున్న సంగతులు, మారుతున్న రాజకీయ సమీకరణాలను చూస్తే మనకు అర్థమవుతుంది.
ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు తనను కలిసేందుకు జగన్ రోజు కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టు చెప్పారు. అలా జగన్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు సలహాదారుల విషయంలో గుర్రుగా ఉండడం, ఎమ్మెల్యేలను బైపాస్ చేసి కొందరు నేతలు వీరిద్వారా పనులు చక్కబెట్టుకుంటున్నారని ఆరోపణలు చేసినట్టు తెలిసింది. ఒక లాబీలా ఈ వర్గం తయారయ్యిందని వారు ఆరోపించారట.
దానికి తోడుగా అనేక కార్యక్రమాల్లో అజయ్ కల్లాం సహా రమేష్ వంటి వారు వేళ్ళు పెడుతున్నట్టుగా జగన్ కి తెలియవచ్చినట్టు సమాచారం. నేరుగా ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలను కూడా అజయ్ కల్లాం పక్కకు పెట్టడం, వాటిని కూడా కొన్నిసార్లు వ్యతిరేకించడం తదితరాలు జగన్ ఏరికోరి తెచ్చుకున్న అధికారిని ఇలా పక్కకు పెట్టినట్టు తెలియవస్తుంది.
అజయ్ కల్లాం ఇప్పుడు తన సబ్జక్ట్స్ కోల్పోయినప్పటికీ.... సలహాదారుగా మాత్రం కొనసాగుతారు. ప్రవీణ్ ప్రకాష్ సీఎంఓ లోకి వచ్చినప్పటి నుంచే జగన్ ప్రవీణ్ ప్రకాష్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలియస్తుంది. ఇప్పుడు అజయ్ కల్లాం ను పక్కకు పెట్టడమే కాకుండా మరో ఇద్దరు నూతన ఐఏఎస్ లను సైతం తన పేషీలోకి జగన్ తీసుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం.