- Home
- Andhra Pradesh
- Airport: ఈ ప్రాంతానికి మహర్ధశ వచ్చినట్లే.. 1400 ఎకరాల్లో, రూ. 648 కోట్లతో కొత్త ఎయిర్ పోర్ట్
Airport: ఈ ప్రాంతానికి మహర్ధశ వచ్చినట్లే.. 1400 ఎకరాల్లో, రూ. 648 కోట్లతో కొత్త ఎయిర్ పోర్ట్
Airport: ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మరో కీలక అడుగు వేసింది. నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ వేగాన్ని పెంచింది.

టెండర్ల ప్రక్రియకు శ్రీకారం
దగదర్తి విమానాశ్రయ నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో చేపట్టనున్నారు. దాదాపు రూ.648 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన సంస్థలు తమ ప్రతిపాదనలను సమర్పించేందుకు గడువు నిర్ణయించగా, అర్హత సాధించిన సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఎంపికైన సంస్థతో దీర్ఘకాలిక రాయితీ ఒప్పందం కుదుర్చుకుని విమానాశ్రయ నిర్మాణం, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను అప్పగించే ప్రణాళిక రూపొందించారు.
1400 ఎకరాల్లో భారీ ప్రాజెక్టు
కావలి నియోజకవర్గ పరిధిలోని దగదర్తి ప్రాంతంలో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం సుమారు 1400 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించారు. ఇందులో విమానాశ్రయ మౌలిక వసతులతో పాటు భవిష్యత్ వాణిజ్య అవసరాల కోసం కూడా ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం విశేషం. మొదటి దశలో రన్వే, టెర్మినల్ భవనం, కార్ పార్కింగ్, షాపింగ్ జోన్, ప్రయాణికుల సేవా కేంద్రాలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరణకు అవకాశం ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు.
దక్షిణ ఆంధ్రకు కొత్త రవాణా కేంద్రం
దగదర్తి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం, కడప, చిత్తూరు ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగవుతుంది. ప్రస్తుతం విమాన ప్రయాణాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గనుంది. ఈ విమానాశ్రయాన్ని రోజుకు రెండు వేల మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందించేలా రూపకల్పన చేస్తున్నారు. రోజువారీగా అనేక విమాన సర్వీసులు నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఆహార ఉత్పత్తులు, పారిశ్రామిక సరుకుల రవాణాకు కూడా ఇది కీలక కేంద్రంగా మారే అవకాశముంది.
రియల్ ఎస్టేట్ రంగానికి బంగారు అవకాశం
విమానాశ్రయం నిర్మాణం ప్రారంభం కావడంతో దగదర్తి, కావలి, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ఎయిర్పోర్ట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు వేగంగా పెరుగుతాయి. అలాగే వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, గోదాములు, లాజిస్టిక్స్ కేంద్రాలు, నివాస ప్రాజెక్టులు పెరిగే అవకాశాలు ఉంటాయి. దగదర్తి ప్రాజెక్టు కూడా అదే దిశగా అభివృద్ధి చెందుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారికి అనుసంధానం ఉండటం వల్ల పెట్టుబడిదారుల దృష్టి ఈ ప్రాంతంపై పడే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్లో ఈ ప్రాంతం ఒక కొత్త ఆర్థిక కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2029 నాటికి తొలి దశ పూర్తి లక్ష్యం
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2028-29 ఆర్థిక సంవత్సరానికి తొలి దశ నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తరువాత ప్రయాణికుల సంఖ్య, వాణిజ్య అవసరాలను బట్టి దశలవారీగా విస్తరణ చేపట్టనున్నారు. ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖల నుంచి అవసరమైన అనుమతులు లభించాయి. పౌర విమానయాన, రక్షణ, హోం, పర్యావరణ శాఖల క్లియరెన్స్లు రావడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది.

