యేలేటి చంద్రశేఖర్ కొత్త ప్రాజెక్టు..వివరాలు
నితిన్ తో ఆయన చేసిన ‘చెక్’సినిమా తర్వాత వెనకబడ్డారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు.
ఒక టైమ్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఊపాయో..అదే విధంగా యేలేటి చంద్ర శేఖర్ సినిమాలు అన్నా యూత్ కు తెగ నచ్చేవి. ఆయన డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునేవారు. పెద్ద స్టార్స్ లేకపోయినా తన కథ,స్క్రీన్ ప్లేనే స్టార్ గా ముందుదు వెళ్లి సక్సెస్ అయ్యారు. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’, ‘మనమంతా’.. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు గర్వించే సినిమాలు అందించిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. నితిన్ తో ఆయన చేసిన ‘చెక్’సినిమా తర్వాత వెనకబడ్డారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే దర్శకుడుగా కాదు. వివరాల్లోకి వెళితే..
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈటీవీకి చెందిన ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ యాప్ (ETV Win APP) కోసం చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు అని తెలిసిందే. అయితే... ఆ సిరీస్ దర్శకుడు మాత్రం చంద్రశేఖర్ యేలేటి కాదు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి నిర్మాతగా మారుతున్నారు. అది కూడా ఈటీవీ విన్ ఓటీటీ కోసం! ఆయన నిర్మాణంలో, ఆయన షో రన్నర్గా ఈటీవీ విన్ యాప్ ఓటీటీ కోసం ఒక ఒరిజినల్ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఆ సిరీస్ నిర్మాణ దశలో ఉంది. ఇంకా పూర్తివివరాలు బయిటకు రావాల్సి ఉంది.
ఇక యేలేటి కెరీర్ ఒక్కసారి చూస్తే ... మొదట్లో అమృతం సిరీయల్కు పది ఎపిసోడ్లకు దర్శకుడిగా పనిచేసారు. ఆ తర్వాత యేలేటి ‘ఐతే’ సినిమాను తెరకెక్కించాడు. అమృతం సిరియల్కు నిర్మాతగా వ్యవహరించిన గుణ్ణం గంగరాజు ‘ఐతే’ చిత్రాన్ని నిర్మించాడు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్గా మంచి సక్సెస్ను సాధించండంతో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
‘ఐతే’ చిత్రం తర్వాత ఛార్మీ, జగపతిబాబు, శశాంక్ ప్రధాన పాత్రల్లో ‘అనుకొకుండా ఒక రోజు’ అనే మిస్టరీ థ్రిల్లర్ను తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. వెంటనే గోపిచంద్తో, చంద్రశేఖర్ యేలేటి బాంబే బ్లడ్ గ్రూప్ అనే కాన్సెప్ట్తో ‘ఒక్కడున్నాడు’ సినిమాను తెరకెక్కించాడు. కమర్షియల్గా ఈ సినిమా సక్సెస్ కాలేదు. ఆ తరువాత మంచు మనోజ్తో ‘ప్రయాణం’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మొత్తం ఏయిర్పోర్ట్లోనే తెరకెక్కింది. తరువాత వచ్చిన సాహసం, మనమంతా సినిమాలు కూడా కొత్త కాన్సెప్ట్తో తెరకెక్కినవే. చివరగా చెక్ సినిమా చేసారు. సినిమాగా చెక్ విభిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిందే.
ప్రేక్షకుల ఆలోచనల కంటే మీరు అడ్వాన్స్డ్ అయ్యుంటారా? అంటే యేలేటి ఏమంటారంటే... అలాగని చాలామంది అంటారు. నా సినిమాలు విడుదలైన రెండు మూడేళ్ల తర్వాత ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది. ‘సినిమాలో అది బావుంది’ అని చెప్తారు. అడ్వాన్స్డ్ అవ్వడం కూడా తప్పే. కాలం కంటే ముందు, వెనుక ప్రయాణించకూడదు. కాలంతో పాటు ప్రయాణించాలి అన్నారు.