SVP: మహేష్ `సర్కారు వారి పాట` చిత్రంపై విజయసాయి రెడ్డి ట్వీట్.. హాట్ టాపిక్
`సర్కారు వారి పాట` చిత్రంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించడం విశేషం. `సర్కారు వారి పాట` చిత్రాన్ని, మహేష్ని అభినందిస్తూ మంచి సందేశాత్మక పాయింట్ని అద్భుతంగా చెప్పారని కొనియాడారు.
సూపర్ స్టార్ మహేష్(Maheshbabu) నటించిన లేటెస్ట్ మూవీ `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata). `గీతగోవిందం` వంటి బ్లాక్బస్టర్ తర్వాత పరశురామ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. కీర్తిసురేష్ కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో గురువారం విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. బ్యాంక్ కుంభకోణాలు, బ్యాంకులకు కార్పొరేట్ అధినేతలు వేల కోట్లు లోన్ ఎగ్గొట్టడాలు అనే అంశాన్ని టచ్ చేశారు. కానీ బలంగా దాన్ని వెండితెరపై ఆవిష్కరించలేదనే టాక్ ఉంది. ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా రూపొందించలేదనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijay Sai Reddy)ప్రశంసలు కురిపించడం విశేషం. `సర్కారు వారి పాట` చిత్రాన్ని, మహేష్ని అభినందిస్తూ మంచి పాయింట్ని అద్భుతంగా చెప్పారని కొనియాడారు. `సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట` బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు` అని పేర్కొన్నారు విజయ సాయిరెడ్డి. ప్రస్తుతం ఆయన ట్వీట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది.
మహేష్బాబు ఇటీవల థియేటర్ల టికెట్ల ధరల కోసం ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని కలిశారు. ప్రభాస్, చిరంజీవి, రామజౌళి, కొరటాల శివ వంటి వారు సీఎంని కలిసిన వారిలో ఉన్నారు. ఈనేపథ్యం తక్కువగా ఉన్న టికెట్ రేట్లని పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ సందర్భంగా మహేష్ జగన్పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు `సర్కారు వారి పాట` చిత్రంలో జగన్ డైలాగ్ `నేను విన్నాను, నేను ఉన్నాను` అనే డైలాగ్ని పెంచారు. ఇది వైసీపీ వ్యతిరేకంగా సెటైర్లు పేల్చేలా ఉందన్నారు.
కానీ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో జగన్పై ప్రశంసలు కురిపించారు మహేష్. `ఆంధ్రప్రదేశ్ `ముఖ్యమంత్రి వైఎప్ జగన్మోహన్రెడ్డిని నేరుగా కలిసినప్పుడు సర్ప్రైజింగ్గా అనిపించింది. ఆయనతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడాను అంతేకానీ నేరుగా కలవలేదు. కానీ ఆ మధ్య కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చాలా సింపుల్. అంత సింపుల్గా ఉంటారా? అని నేరుగా కలిసినప్పుడు అనిపించింది ` అని చెప్పారు. ఇప్పుడు ఏకంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ప్రశంసలు కురిపించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది.