Saamanyudu Trailer: రొమాన్స్, క్రైమ్, యాక్షన్.. మంచి కిక్కిస్తున్న 'సామాన్యుడు' ట్రైలర్
విశాల్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో. విశాల్ ఇటీవల ఎక్కువగా క్రైమ్, యాక్షన్ చిత్రాలు చేస్తున్నాడు.
విశాల్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో. విశాల్ ఇటీవల ఎక్కువగా క్రైమ్, యాక్షన్ చిత్రాలు చేస్తున్నాడు. ఏదో ఒక ఆసక్తికర పాయింట్ ఎంచుకోవడం.. దాని చుట్టూ మంచి స్క్రీన్ ప్లే అల్లుకుని మెప్పిస్తున్నారు. అభిమన్యుడు, యాక్షన్, ఇటీవల వచ్చిన ఎనిమి చిత్రాలు ఆ కోవకు చెందినవే. అదే తరహాలో విశాల్ నుంచి వస్తున్న మరో మూవీ 'సామాన్యుడు'.
శరవణన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూడగానే సినిమాపై ఆసక్తి పెరిగిపోవడం ఖాయం. 'నీకో మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా అంటూ విశాల్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
'ఒక ఇంట్లో రెండు శవాలు ఉన్నాయి.. అందులో ఒక శవానికి ప్రాణం ఉంది' అంటూ విశాల్ చెప్పే డైలాగులు ఉత్కంఠ పెంచే విధంగా ఉన్నాయి. ఈ చిత్రంలో తెలుగు బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోంది. డింపుల్, విశాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ కుర్రాళ్ళని ఆకర్శించే విధంగా ఉన్నాయి.
కథలో పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ అంశాలని చక్కగా మిళితం చేసినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ఇక విశాల్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశాడు. విశాల్ పోరాట సన్నివేశాలు పవర్ ఫుల్ గా ఉన్నాయి. గొర్రె, కుక్క పిల్లని బాధపెట్టవచ్చు.. కానీ సింహాన్ని బాధపెట్టలేరు అనే డైలాగులు బావున్నాయి.
విశాల్ తన సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. త్వరలో ఈ చిత్ర రిలీజ్ కు సన్నాహకాలు జరుగుతున్నాయి.