Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీకి చేరిన విశాల్ నామినేషన్ లొల్లి

  • ఆర్ కె నగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ వేసిన విశాల్
  • విశాల్ నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి
  • నామినేషన్ తిరస్కరణపై పోరాటానికి దిగిన విశాల్
vishal nomination issue reached delhi cec

అమ్మ జయలలిత సమాధి వద్ద ప్రార్థన చేసి ఆర్ కె నగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ వేసిన విశాల్ కు నామినేషన్ తిరస్కరించి ఈసీ షాక్ ఇచ్చింది. తాజాగా విశాల్ నామినేషన్ అంశం ఢిల్లీకి చేరింది. విశాల్ నామినేషన్ ను తమిళనాడు రాష్ట్ర ఎన్నికల అధికారులు తిరస్కరించడం... ఆమోదించడం... మళ్లీ తిరస్కరించడం... ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చి విశాల్ కు షాక్ ఇచ్చారు. తన నామినేషన్ తిరస్కరణపై విశాల్ పోరాటం మొదలుపెట్టారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.


సీఈసీకి ఫిర్యాదు చేసిన విశాల్... కావాలనే తన నామినేషన్ పత్రాలను తిరస్కరించారని న్యాయం చెయ్యాలని భారత ఎన్నికల కమిషన్ అధికారులను కోరాడు. విశాల్ ఫిర్యాదు స్వీకరించిన సీఈసీ వెంటనే రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టింది.  తమిళనాడు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని భారత ఎన్నికల కమిషన్ అధికారులు సంప్రదించారు. విశాల్ నామినేషన్ పత్రాలు ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో ఆరాతీశారు.

 

అయితే విశాల్ నామినేషన్ పత్రాల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచే వారి వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, ఇతరత్రా సాంకేతిక కారణాలను తమిళనాడు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామి ఢిల్లీ అధికారులకు వివరించారు. తమిళనాడు అధికారుల వివరణను తీసుకున్న భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధి తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.

 

తన నామినేషన్ పత్రాలు తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విశాల్ ఆరోపించారు. తన నామినేషన్ పత్రాలను తిరస్కరించడం ప్రజాస్యామ్యానికి పెద్ద ఎదురుదెబ్బ అని విశాల్ ఆరోపించారు. తన ట్వీట్ లో `డిసెంబర్ 5 - 2016న అమ్మ (జయలలిత) చనిపోయింది. డిసెంబర్ 5 - 2017న ప్రజాస్వామ్యం చచ్చిపోయింది` అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు విశాల్. మరి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఏం తేలుస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios