ఓటీటీలో మరో భారీ చిత్రం.. విక్రమ్ నటించిన `మహాన్` రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రయోగాలకు కేరాఫ్గా నిలిచే చియాన్ విక్రమ్ నటించిన చిత్రం `మహాన్`ని ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ సంస్థ డిజిటల్ రైట్స్ ని దక్కించుకుంది.
కరోనా కారణంగా థియేటర్లు రన్ చేయడం కష్టంగా మారిపోయింది. సినిమాలు ఆగిపోయాయి. దీంతో ఇప్పుడు మళ్లీ అంతా ఓటీటీల వైపు చూస్తున్నారు. సెకండ్ వేవ్ కరోనా సమయంలో సూర్య నటించిన `జైభీమ్` చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. ఇది సంచలన విజయం సాధించింది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ రేటింగ్ సైట్ ఐఎండీబీ ఇచ్చిన రేటింగ్లో నెంబర్ వన్గా నిలిచింది. ఇప్పుడు తమిళం నుంచి మరో భారీ సినిమా ఓటీటీలో రాబోతుంది.
ప్రయోగాలకు కేరాఫ్గా నిలిచే చియాన్ విక్రమ్(Vikram) నటించిన చిత్రం `మహాన్`(Mahaan)ని ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ సంస్థ డిజిటల్ రైట్స్ ని దక్కించుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 10న `మహాన్`ని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. అమెజాన్ ప్రైమ్ ఈ విషయాన్ని ప్రకటించింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
ఇందులో విక్రమ్తోపాటు ఆయన కుమారుడు ధృవ విక్రమ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బాబీ సింహా, సిమ్రాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా, సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించారు. అన్ని బాగుంటే ఈ చిత్రం థియేటర్లలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా తమిళనాట థియేటర్లపై ఆంక్షలుండటంతో ఇంకా వెయిట్ చేయడం వల్ల ప్రయోజనం లేదని భావించిన యూనిట్ ఓటీటీ వైపు మొగ్గుచూపింది. ప్రస్తుతం విక్రమ్ `మహాన్`తోపాటు `కోబ్రా`, `పొన్నియిన్ సెల్వన్ 1` వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.