`గీత గోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబోలో మరో సినిమా రాబోతుంది. ఈ సినిమా తాజాగా బుధవారం ప్రారంభమైంది. ఇందులో మృణాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ మరో సినిమాని ప్రారంభమైంది. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని తాజాగా బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. అతిథిగా వచ్చిన నిర్మాత, మల్లెమాల అధినేత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి (క్లాప్‌) చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభం కావడం విశేషం. ఫస్ట్ షార్ట్ ను గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు, ప్రముఖ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. 

ఇందులో హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ కూడా పాల్గొన్నారు.ఈ సినిమాలో మొదట పూజా పేరు వినిపించింది. కానీ అనూహ్యంగా మృణాల్‌ ఠాకూర్‌ పేరు తెరపైకి వచ్చింది. రావడమే కాదు, ఇప్పుడు ఏకంగా సినిమా కూడా ప్రారంభమైంది. విజయ్‌ దేవరకొండ `వీడీ13`పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తన శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్‌పై ఆయన సోదరుడు శిరీష్‌తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం. దిల్‌రాజు నిర్మాణంలో విజయ్‌ మొదటిసారి సినిమా చేస్తుండగా, విజయ్‌, మృణాల్‌ సైతం ఫస్ట్ టైమ్‌ కలిసి నటిస్తున్నారు. తాజాగా వీరంతా ఈ ఓపెనింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ దర్శకత్వంలో ఇప్పటికే `గీత గోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌ వచ్చింది. ఆ సినిమా వందకోట్లు కలెక్ట్ చేసింది. అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో విజయ్‌ స్టార్‌ హీరో అయిపోయారు. ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిరిగేలా చేసుకున్నారు. అనంతరం మరోసారి ఈ కాంబినేషన్‌ సెట్‌ కావడంతో దీనిపై ప్రారంభం నుంచి క్రేజ్‌, బజ్‌ నెలకొంది. పైగా `సీతా రామం` బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌ కావడంతో మరింత క్రేజ్‌ నెలకొంది. 

Scroll to load tweet…

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్‌. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇది సెప్టెంబర్‌లో రిలీజ్‌ కాబోతుంది. దీంతోపాటు గౌతమి తిన్ననూరితో మరో సినిమా చేస్తున్నారు విజయ్‌. ఇటీవలే ఇది కూడా ప్రారంభమైంది. ఇప్పుడు పరశురామ్‌ సినిమాని కూడా లాంచ్‌ చేసి ఒకేసారి మూడు సినిమాలను లైన్‌లో పెట్టారు విజయ్‌. అయితే `ఖుషి` షూటింగ్‌ పూర్తికాగానే ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని, త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తామని టీమ్‌ తెలిపింది. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట పరశురామ్‌. అయితే ఇది `గీత గోవిందం`కి సీక్వెల్‌గా ఉంటుందన్నారు, కానీ పూర్తి కొత్త కథ అని సమాచారం.