నేటి సినిమాల్లో ఉన్నది శృంగారం కాదు.. అంగారం!
మహానటుడు ఎస్వీ రంగారావు శతజయంతి వేడుకలు మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేటి సినిమాలను ఉద్దేశిస్తూ సెటైరికల్ గా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది
మహానటుడు ఎస్వీ రంగారావు శతజయంతి వేడుకలు మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేటి సినిమాలను ఉద్దేశిస్తూ సెటైరికల్ గా మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పంచ్ డైలాగ్స్ రాసేవారికి ఏమాత్రం తీసిపోకుండా వెంకయ్యనాయుడు సినిమాల మీద పంచ్ లు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
పాత సినిమాలలో నవరసాలు పోషించే తారలు ఉండేవారని కానీ ఇప్పుడు అలాంటి వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేటి తరం నటీనటులు పాత సినిమాలు చూసి నటన నేర్చుకోవాలని సూచించారు. సినిమా సంగీతం, కథానాయికలు, శృంగారం, హింస ఇలా ప్రతి ఒక్క అంశం గురించి కూడా ప్రస్తావించారు.
''ప్రస్తుతం సినిమాల్లో శృంగారం తగ్గింది.. అంగారం పెరిగింది శృంగారం అనేదాన్ని అసభ్యకరంగా చూపించకూడదు. దానిపై జుకుప్స కలిగించకూడదు. అప్పట్లో హీరోలు, హీరోయిన్లను ముట్టుకునేవారే కాదు. అయినా శృంగారం పండేది. దానికి కారణం వారి హావభావాలు. కానీ ఇప్పటితారలు హీరోయిన్ ను తాకినా, పీకినా శృంగారం ఎక్కడా కనిపించడం లేదు. అంతా అంగారమే.. నటించడం రాకపోవడం వలనే ఇదంతా జరుగుతుంది. ఇక సినిమాలు తీసేవారు తమ కుటుంబం, పిల్లలతో కలిసి సినిమా చూసి అవి ఫ్యామిలీస్ చూసే విధంగా ఉన్నాయో లేదో రివ్యూ చేసుకోమని'' సూచించారు. ప్రజలపై సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని కాబట్టి హింస, అసభ్యతలకు తావివ్వకుండా సినిమాలు చేయాలని మనకున్న గొప్ప సంస్కృతిని నిలబెట్టే విధంగా సినిమాలు చేయాలని సూచించారు.