ఉపాసనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు గురించి అందరికీ తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు గురించి అందరికీ తెలిసిందే. ‘బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్స్టైల్’ మ్యాగజైన్కు చీఫ్ ఎడిటర్గా ఉపాసన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె ఖాళీ సమయాల్లో సామాజిక కార్యక్రమాలు చేస్తూంటారు. ఈ నేపధ్యంలో ఉపాసన దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పురస్కారంకు ఎంపికయ్యారు. 'ఈ ఏటి మేటి పరోపకారి'గా ఉపాసనను ఎంపిక చేశారు.
తన అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం లభించింది. దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. భిన్నరంగాలకు చెందిన ప్రతిభావంతులకు, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డు అందిస్తున్నారు.
తనకు ఈ అవార్డు రావడం పట్ల ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. "నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు" అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్.. ‘ప్రియమైన ఉప్సీ.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా’ అని తన భార్య ఉపాసనకు ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.