నటి తేజస్విని గౌడతో టీవీ నటుడు అమర్ దీప్ ఎంగేజ్మెంట్..
`జానకి కలగనలేదు` ఫేమ్ నటుడు అమర్ దీప్ చౌదరి, నటి తేజస్విని గౌడ ఒక్కటి కాబోతున్నారు. తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
తెలుగు టీవీ నటుడు అమర్ దీప్ చౌదరి, నటి తేజస్విని గౌడ త్వరలో ఓ ఇంటివాళ్లు కాబోతున్నారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. వీరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయాన్ని తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అరియానా వెల్లడించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి ఎంగేజ్మెంట్ వీడియో క్లిప్ని పంచుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇందులో అమర్దీప్, తేజస్విని పూలదండలు మార్చుకుని ఉన్నారు. ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా వారి అభిమానులు, టీవీ ఆడియెన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమర్, తేజూని పెళ్లి చేసుకుంటున్నారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదెప్పుడు జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇలా సడెన్గా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం అందరిని షాక్కి గురి చేస్తుండటం విశేషం. ఏదేమైనా త్వరలో ఒక్కటి కాబోతున్న ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం `జానకి కలగనలేదు` అనే సీరియల్లో నటుడు అమర్దీప్ నటిస్తున్నారు. మరోవైపు తేజస్విని `కేరాఫ్ అనసూయ`అనే సీరియల్ లో నటిస్తుంది. ఏపీకి చెందిన అమర్దీప్ బి.టెక్ పూర్తి చేశాడు. లండన్లో హైయ్యర్ స్టడీస్ చేసి తిరిగొచ్చాక `పరిణయం` అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. ఆ తర్వాత వరుసగా పలు లఘు చిత్రాలు, సినిమాలు, వెబ్ సిరీస్లోనూ నటించారు. `ఉయ్యాల జంపాల` సీరియల్ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత నటించిన `సిరి సిరి మువ్వ`లో లీడ్గా చేసి పాపులర్ అయ్యారు. కన్నడకి చెందిన తేజస్విని గౌడ కన్నడతోపాటు తమిళంలోనూ పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె `కేరాఫ్ అనసూయ`లో నటిస్తుంది.