బుక్ మై షో, పేటియంకు షాక్.. సినిమా టికెట్లపై కేసీఆర్ సంచలన నిర్ణయం!
డిజిటిల్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ సేవలు పెరిగిన తర్వాత సినిమా బిజినెస్ లో కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు థియేటర్స్ వద్ద టికెట్ల కోసం క్యూలు కట్టేవారు. ఆ తర్వాత సినిమా టికెట్ల విక్రయం ఆన్లైన్ లోకి వచ్చింది.
బుక్ మై షో, పేటియం లాంటి సంస్థలు ఆన్లైన్ లో సినిమా టికెట్లని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. కస్టమర్ నుంచి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తూ బాగానే బిజినెస్ చేసుకుంటున్నాయి. ఆన్లైన్ లో కస్టమర్స్ నుంచి ఈ సంస్థలు అత్యధిక మొత్తంలో టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయంపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల అసెంబ్లీ లో సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ప్రకటన బుక్ మై షో, పేటియం లాంటి సంస్థలకు షాక్ ఇచ్చే విధంగా ఉంది.
బుక్ మై షో, పేటియం సంస్థల అనుమతిని రద్దు చేసి సొంతంగా సినిమా టికెట్లని విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఆన్లైన్ లో ఓ పోర్టల్ ని ప్రారంభించే యోచనలో కూడా ఉన్నట్లు తలసాని పేర్కొన్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం థియేటర్ మేనేజ్ మెంట్ ప్రతి 200 టికెట్ల విక్రయానికి రూ 100 టాక్స్ చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక బుక్ మై షో లాంటి సంస్థలు కస్టమర్ నుంచి అదనంగా 20 నుంచి రూ 30 వరకు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం సొంతంగా టికెట్లు విక్రయించడం వల్ల రావాల్సిన టాక్స్ సక్రమంగా ఖజానాకు చేరుతుందని భావిస్తున్నారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.