టాలీవుడ్ సినీ కో-డైరెక్టర్ ఆత్మహత్య,కారణం
అతని ఇంట్లో నుంచి తీవ్ర దుర్గంధం వస్తోందని మంగళవారం మధ్యాహ్నం స్థానికులు బోరబండ పోలీసులకు సమాచారం అందించారు.
సినీ కో-డైరెక్టర్, స్క్రిప్ట్రైటర్ ఎస్.శివ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన సినీ వర్గాల్లో చర్చగా మారింది. హైదరాబాద్ బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలోని రాజ్నగర్ బస్తీలో చోటుచేసుకుంది. ఎస్.శివ కు ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా సినిమాలకు కో డైరక్టర్ గా పనిచేసారు. అలాగే స్క్రిప్టు డిస్కషన్స్ లో ఉత్సాహంగా పాల్గొని మంచి ఇన్ పుట్స్ ఇచ్చేవారు. ఆయన మృతితో అనుబంధం ఉన్న సినిమా వాళ్లు నివాళలు అర్పిస్తున్నారు.
డీఐ బి.భూపాల్గౌడ్ తెలిపిన ప్రకారం బందరు ప్రాంతానికి చెందిన ఎస్.శివ(65) సినిమాలకు కో-డైరెక్టర్, స్క్రిప్ట్రైటర్గా పని చేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. కూతుళ్లకు వివాహాలు కాగా, భార్యతో వివాదాల కారణంగా ఒంటరిగా ఉంటున్నాడు. చాలాకాలం శ్రీకృష్ణానగర్లో నివసించిన ఆయన గత మార్చిలో బోరబండ రాజ్నగర్ బస్తీలోని హరనాథ్ గుప్తా ఇంటిలో అద్దెకు దిగాడు. అతని ఇంట్లో నుంచి తీవ్ర దుర్గంధం వస్తోందని మంగళవారం మధ్యాహ్నం స్థానికులు బోరబండ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఇంటి తలుపులు తెరచి చూడగా.. శివ ఉరి వేసుకొని కనిపించాడు. అక్కడే ఉన్న అయిదు పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు. అతడు మృతిచెంది మూడు రోజులై ఉంటుందన్నది పోలీసుల ప్రాథమిక అంచనా. అనారోగ్యం, ఒంటరితనం కారణంగా అత్మహత్య చేసుకొని ఉంటాడని తెలిపారు. బోరబండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.