టాలీవుడ్ సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు వీకే నరేష్ (VK Naresh) భార్య రమ్య రఘుపతి అధిక వడ్డీ డబ్బులు ఇప్పిస్తామని  డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు మంగళవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ తెలిపారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు వీకే నరేష్ (VK Naresh) భార్య రమ్య రఘుపతి అధిక వడ్డీ డబ్బులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు మంగళవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమ్య రఘుపతి దాదాపు రూ.50 లక్షల రూపాయలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై స్పందించిన నటుడు నరేష్.. రమ్య రఘుపతి జరిపే వ్యాపార, ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. వసూళ్లతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

తమకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని తెలిపారు. అయితే 5 ఏళ్ల క్రితం విడిపోయామని చెప్పారు. రమ్య తాను కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నామని నరేష్ వెల్లడించారు. ఇద్దరం ఒకటే క్యాంపస్‌లో ఉన్నప్పటికీ ఆరేళ్లుగా దూరంగా ఉంటున్నామని చెప్పారు. రమ్య వసూళ్లపై ఇప్పటికే చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారని నరేష్ తెలిపారు. ఆమెకు డబ్బులు ఇవ్వొద్దని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు గతంలోనే చెప్పామని అన్నారు. 

అసలేం జరిగిందంటే..
రమ్య రఘుపతి తమకు అధిక వడ్డీ ఆశ చూపి లక్షల్లో డబ్బులు తీసుకుని చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఐదుగురు మహిళలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 'గ్రూప్ ఇన్‌కమ్ స్కీమ్' కింద ఆరు నెలల వ్యవధిలో తమ పెట్టుబడులపై 20 శాతం రాబడిని ఇస్తానని రమ్య తమకు చెప్పిందని మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా రమ్యను కలిశామని మహిళలు చెప్పారు. రమ్య తనను తాను ఒక శక్తివంతమైన మాజీ మంత్రి కుమార్తెగా, అలాగే నటుడు నరేష్ భార్యగా పరిచయం చేసుకుందని తెలిపారు.

‘బెంగళూరులో హోటళ్లు ఉన్నాయని, ఎన్జీవోను కూడా నడుపుతున్నానని రమ్య చెప్పింది. అయితే కొన్ని రోజుల తర్వాత డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఆమె ఒత్తిడి చేయడం చెక్కులను ఇచ్చింది. అయితే అవి బ్యాంకులో బౌన్స్ అయ్యాయి. దీంతో రమ్య వద్దకు వెళితే తీవ్ర పరిణామలు ఉంటాయని బెదిరించింది. కొద్ది రోజుల క్రితం నటుడు నరేష్‌ను కలిసి పరిస్థితిని వివరించాం. అయితే రమ్య వసూళ్లకు సంబంధించి నరేష్ విచారం వ్యక్తం చేశారు. రమ్యతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నానని చెప్పారు. రమ్య తల్లికి సమాచారం ఇవ్వగా.. ఆమె కూడా ఇదే విషయాన్ని చెప్పింది. రమ్య మానసికంగా, శరీరకంగా బాగోలేదని తెలిపింది’ అని బాధితులు చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి గచ్చిబౌలి సిఐ సురేష్ మాట్లాడుతూ.. ‘2019లో కొంత మంది మధ్యవర్తిత్వుల ద్వారా అగ్రిమెంట్ చేసుకుని రమ్య రఘుపతి ఐదు మంది దగ్గర డబ్బులు తిసుకున్నారు. ఇందులో కొంతమేర చెల్లించి మిగతా డబ్బులకు చెక్కులు ఇచ్చారు . ఈ చెక్కులు బౌన్స్ కావడంతో 3 రోజుల క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు. మాదాపూర్ డీఎస్పీ కె శిల్పవల్లి మాట్లాడుతూ.. రమ్య రఘుపతి మహిళలను దాదాపు 40 లక్షల రూపాయల వరకు మోసం చేసినట్టుగా ఫిర్యాదులు వచ్చాయన్నారు.