థగ్ లైఫ్ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అన్నారు కమల్ హాసన్. గతంలో తమ కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు సినిమా కంటే కూడా ఈ సినిమా ఇంకా ఎక్కువ సక్సెస్ సాధిస్తుందన్నారు. ఇంతకీ కమల్ హాసన్ ఏమంటున్నారంటే? 

ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల్లో "థగ్ లైఫ్" ఒకటి. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు, అభిరామి వంటి కీలక నటీనటులు ఈ చిత్రంలో నటించారు. హీరో నితిన్ తండ్రి ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా తెలుగు వర్షన్ ప్రీరిలీజ్ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కమల్ హాసన్ మాట్లాడుతూ "మణిరత్నం గారు నాయకుడు సినిమాతో అందరిని సర్ప్రైజ్ చేసినట్లుగానే, థగ్ లైఫ్ ద్వారా మరింతగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటారు," "నేను ద్రోణాచార్యుడిని కాను, నేను ఇంకా విద్యార్థినే. నేను ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నాను, థగ్ లైఫ్ సినిమాను మనసుపెట్టి చేశాను. ఇది నాయకుడు కంటే పెద్ద హిట్ అవుతుంది, ఇది నా ప్రామిస్ అని అన్నారు కమల్.

ఇక  శింబుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించిన విషయాన్ని వెల్లడించారు. "సినిమానే మాకు గురువు, అందుకే నేనెప్పటికీ ఒక సినిమా విద్యార్థినే," అన్నారు కమల్.

ఈ సినిమాలో నటించిన స్టార్స్ గురించి కూడా కమల్ మాట్లాడారు.  నాజర్ గారు ఆల్రౌండర్. ఆయనతో జర్నీ కొనసాగుతున్నది. త్రిష, శింబులతో పనిచేయడం ఆనందంగా ఉంది. అభిరామి మళ్లీ నా సినిమా లో నటించడం హ్యాపీగా ఉంది, "ఇంత మంచి సినిమా మళ్లీ మళ్లీ రాదు. అందుకే ఇది పెద్ద సెలబ్రేషన్ అవుతుంది," అని కమల్ నమ్మకంగా చెప్పారు. 

తెలుగు  ఇండస్ట్రీ గురించి కూడా కమల్ కామెంట్ చేశారు.  తెలుగులో కూడా నేను  స్టార్‌గా ఎదిగానుి, తెలుగు ప్రేక్షకుల ఆదరణకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందుకే నేను సినిమాను తెలుగు ప్రేక్షకులకోసం ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నాను," అని కమల్ హాసన్ అన్నారు.

జూన్ 5న విడుదల కాబోతున్న థగ్ లైఫ్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిందని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా తమకు ఎంతో ప్రత్యేకమైనదని, ప్రేక్షకులందరిని థియేటర్లకు రప్పించేలా ప్రమోషన్ జోరుగా కొనసాగుతుందని తెలిపారు.