బాహుబలి కలెక్షన్స్ పై దర్యాప్తు జరగాలి... ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ
ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా టికెట్ల కలెక్షన్ విషయంలో సినిమా విడుదలైన తొలివారంలో సగం డబ్బు ప్రభుత్వానికి.. డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని తెలిసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
బాహుబలి సినిమా కలెక్షన్స్ విషయంలో అవకతవకలు జరిగాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఒకప్పుడు ఎన్టీఆర్ నుంచి రాజబాబు వరకు ఎవరి సినిమాలైనా టికెట్ ధరలు ఒకేలా ఉండేవి. సినిమా హిట్ అయితే థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడేవని గుర్తు చేశారు. నేడు పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉందని, టిక్కెట్ ధరను రూ.500 వరకు పెంచేసి వారం రోజుల్లోనే పెట్టుబడులు రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా టికెట్ల కలెక్షన్ విషయంలో సినిమా విడుదలైన తొలివారంలో సగం డబ్బు ప్రభుత్వానికి.. డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని తెలిసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సినిమా విడుదలైన తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపినట్టు తెలిసిందన్నారు. ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్ను రాలేదో తేల్చాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంపై నిజం నిగ్గుతేలేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
ఆన్లైన్ ద్వారా టికెట్స్ అమ్మకాలను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ వ్యాఖ్యలు దుమారం రేపగా, పవన్, వైసీపీ వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. నటుడు పోసాని కృష్ణమురళి తన కుటుంబంపై పవన్ ఫ్యాన్స్ దాడి చేస్తున్నారని, బూతులు తిడుతున్నారని, దీని వెనుక పవన్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ ని తీవ్ర పదజాలంతో దూషించగా, జనసేన కార్యకర్తలు ఆయనపై దాడికి యత్నించారు.