అంతా తూచ్ః సినీ జనాల ఆశలపై నీళ్లు.. థియేటర్ల ఓపెనింగ్ పై నో క్లారిటీ
తాజా గుడ్న్యూస్తో వారిలో కొత్త ఆశలు రేకెత్తించాయి. కానీ అంతలోనే నీళ్లు చల్లినట్టయ్యింది. థియేటర్ల ఓపెన్కి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
రేపటి నుంచి థియేటర్లు ఓపెన్ అవుతాయి. ఈ నెల 23 నుంచి కొత్త సినిమాలు విడుదలవుతాయనే వార్తతో సినీ ప్రియుల్లో కొత్త ఆశలు చిగురించాయి. థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా? అని వెయిట్ చేస్తున్నారు. తాజా గుడ్న్యూస్తో వారిలో కొత్త ఆశలు రేకెత్తించాయి. కానీ అంతలోనే నీళ్లు చల్లినట్టయ్యింది. థియేటర్ల ఓపెన్కి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. రేపటి నుంచి థియేటర్లని ఓపెన్ చేస్తారని, ఈ నెల 23 నుంచి కొత్త సినిమాల విడుదల ఉంటుందనే వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు.
`తెలంగాణలో నెలకొన్న థియేటర్స్ కి సంభందించిన సమస్యలపై ఈ రోజు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఇప్పటి వరకు తెలంగాణలో థియేటర్స్ ఓపెనింగ్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎటువంటి రూమర్స్ని నమ్మవద్దు` అని ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు వెల్లడించారు. తెలంగాణలో థియేటర్ల ఓపెనింగ్కి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారని, ఆయన హామీతో రేపటి నుంచి థియేటర్లు ఓపెన్ చేసేందుకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారని, వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లని రన్ చేసుకోవచ్చని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇది వాస్తవం కాదని తెలిపారు.
కాగా ఈ రోజు శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఒక సంవత్సరం నుండి సినిమా దియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని మంత్రికి వివరించారు. సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా దియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని, ప్రభుత్వం ఈ కష్టకాలంలో అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు.
ప్రధానంగా సినిమా దియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, SGST ట్యాక్స్ ను రద్దు చేయాలని, GO 75 ను పునరుద్దరించాలని, షూటింగ్ అనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించాలని తదితర డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు. సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్ గౌడ్, బాల గోవింద్ రాజ్ తాడ్ల తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో TSFDC ED కిషోర్ బాబు ఉన్నారు.