రేపే మహేష్, ఎన్టీఆర్ యుద్ధం..ఫ్యాన్స్ రెడీ
- స్పైడర్ గా వస్తున్న మహేష్
- జై లవ కుశ తో ఎన్టీఆర్
- వారం తేడాతో ప్రేక్షకుల ముందుకు మహేష్, ఎన్టీఆర్
ఈ ఏడాది దసరా పండగ.. ఎన్టీఆర్, మహేష్ అభిమానులకు పెద్ద పండగ. వారం తేడాతో వీరిద్దరి సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మురగదాసు దర్శకత్వంలో స్పైడర్ గా వస్తున్నాడు మహేష్. ఇందులో మహేష్.. ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా మహేష్ కి జోడిగా రకుల్ కనిపిస్తోంది. మురగదాస్ దర్శకత్వం కాబట్టి.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
మరో వైపు.. అంతకు మించి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఎన్టీఆర్. బాబి దర్శకత్వంలో తొలిసారి తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘జై లవ కుశ’. సినిమా ట్రైలర్ ని చూశాక సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇందులో రాశీఖన్నా, నివేదా థామస్ లు ఎన్టీఆర్ తో జతకట్టారు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేష్, తారక్ ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకొంత సమయం వేచి ఉంది.
అయితే.. ఈలోగా రేపు వీరిద్దరి మధ్య మరో చిన్నపాటి యుద్ధం నెలకొంది. రేపు స్పైడర్ ట్రైలర్ లాంచ్. జైలవకుశ లోని ఐటెం సాంగ్ కూడా రేపే లాంఛ్ చేస్తున్నారు. తమన్నా నటించిన ఈ ఐటెం సాంగ్ కి, మహేష్ స్పైడర్ ట్రైలర్ లలో ఏది ట్రెండ్ సెట్ చేస్తుంది..? ఎక్కువ వ్యూస్ దేనికి వస్తాయి అంటూ.. ఇప్పటికే చర్చ మొదలైంది. వారిద్దరి అభిమానులు కూడా ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. మరి ఈ యుద్ధంలో పై చేయి ఎవరిదో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.