పెద్ద వివాదంలో అదా శర్మ సినిమా, సీఎం కు పిర్యాదు, కేసు నమోదు
సినిమా టీజర్ పై కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సరైన విచారణ చేపట్టాలని డీజీపీ అనిల్కాంత్ తిరువనంతపురం పోలీస్ కమిషనర్ను ఆదేశించారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగు ఆడియన్స్కు పరిచయమైన అదా శర్మ తన గ్లామర్తో నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించింది. అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి అలరించింది అదా. ఆ తర్వాత బాలీవుడ్లోనూ అడుగుపెట్టి విజయాలు సొంతం చేసుకుంది. అదాకు చేతి నిండా సినిమాలు లేకపోయినా.. ఎపుడు ఏదో ఒక ఫోటో షూట్తో,వివాదాస్పద వార్తల్లో నిలుస్తూ ఉండటం విశేషం.
తాజాగా ఆమె నటించిన ఓ చిత్రం వివాదాస్పదమైంది. సినిమా టీజర్ రిలీజైన వెంటనే సెన్సేషన్ అయ్యింది. ముఖ్యమంత్రికి ఆ సినిమా గురించి కంప్లైంట్ చేసారు.ఆ వివరాల్లోకి వెళితే.. ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ పై కేరళ రాష్ట్రవాసులు ఓ రేంజిలో మండిపడుతున్నారు. అందులో పేర్కొన్న అంశాలు షాకింగ్గా ఉన్నాయని సోషల్ మీడియాలో, మీడియాలో మాట్లాడుతున్నారు ఆ రాష్ట్ర వాసులు.ఆ టీజర్ లోని ఓ డైలాగ్ కేరళలో వివాదానికి కారణమయ్యింది. ఇక ఇదే విషయం పై అభ్యంతరం తెలుపుతూ కేరళ సీఎంకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు కాపీని కేరళ సీఎం పినరయి విజయన్కు కూడా పంపారు. ఆ తర్వాత దానిని డీజీపీకి పంపారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సరైన విచారణకు ఆదేశించారు కేరళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనిల్ కాంత్. రాష్ట్రాన్ని ఉగ్రవాదుల సురక్షిత ప్రాంతంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ “ది కేరళ స్టోరీ” చిత్ర టీమ్ పై కేసు నమోదు చేయాలని కేరళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనిల్ కాంత్ తిరువనంతపురం పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ను ఆదేశించారు. ఇంతకీ టీజర్ లో ఏముందంటే..
“నా పేరు షాలిని ఉన్నికృష్ణన్. నర్సుగా ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను ఫాతిమా బా అనే ఐసిస్ ఉగ్రవాదిని. ‘నేను ఆఫ్ఘనిస్థాన్లో జైల్లో ఉన్నాను’ అనే డైలాగ్తో టీజర్ మొదలవుతుంది. ‘నేను ఒంటరిని కాదు. నాలాంటి 32 వేల మంది అమ్మాయిలు మతం మారి సిరియా, యెమెన్ ఎడారుల్లో చనిపోయారు. ఓ సాధారణ అమ్మాయి ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మారే భయంకరమైన గేమ్ కేరళలో చోటుచేసుకుంది. అది కూడా బహిరంగంగానే. దీన్ని ఎవరూ ఆపలేదా? ఇది నా కథ. ఆ 32 వేల మంది అమ్మాయిల కథ ఇది. ‘ఇది కేరళ కథ’ అంటూ ఆదాశర్మ చెప్పిన డైలాగ్తో టీజర్ ముగిసింది. ‘ది కేరళ స్టోరీ’ టీజర్ వైరల్గా మారింది. కేరళను కించపరిచే విధంగా చిత్రీకరించినందుకు ఈ టీజర్పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుదీప్తో సేన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వీఏ షా నిర్మించారు.