`బ్రో` సక్సెస్ మీట్లో మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాని తాను కమర్షియల్ చిత్రంగా చూడలేదని, అందుకే పాటల విషయంలో ఫెయిల్ అయ్యానేమో అంటూ అసలు విషయాన్ని బయటపెట్టేశారు.
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన `బ్రో` చిత్ర సక్సెస్ మీట్ని సోమవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఫెయిల్ కావడానికి కారణమేంటో చెప్పారు. `బ్రో` చిత్రంలో పాటలకు ఆశించిన స్పందన లేదు. `బ్రో` థీమ్ సాంగ్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించింది. కానీ పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే దీనిపై గతంలో ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ, ఇది తాము ఊహించిందే అన్నారు. దీన్ని కమర్షియల్ సినిమాగా చూడలేమని, వాటిలా మ్యూజిక్ చేయలేమన్నారు.
తాజాగా `బ్రో` సక్సెస్ మీట్లో మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాని తాను కమర్షియల్ చిత్రంగా చూడలేదని, అందుకే పాటల విషయంలో ఫెయిల్ అయ్యానేమో అంటూ అసలు విషయాన్ని బయటపెట్టేశారు. సినిమాకి థీమే ఇంపార్టెంట్ అని, సినిమాని తాను టైమ్ గాడ్గా చూశాను, పవన్ని దేవుడిగా చూశానని తెలిపారు తమన్. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో బాగా చేసే అవకాశం దక్కింది. ఆ గ్రావిటీ ఇచ్చిన సముద్రఖనికి ధన్యవాదాలు. నిజానికి ఆయనతో 22ఏళ్ల క్రితమే పనిచేశాను. ఆయన సీరియల్కి నేను వర్క్ చేశాను. అప్పట్నుంచి ఆయన తెలుసు. ఆయన ఒక మట్టి మనిషి. వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆయన అలా ఉంటారు. జనాలనుప్రేమిస్తారు. ఎంత పెద్ద వర్క్ అయినా ఈజీగా చేసేస్తారు. ఈ సినిమా వల్ల ఆయనతో నా అనుబంధం మరింత బలపడింది.
త్రివిక్రమ్ గురించి చెబుతూ, ఆయనకు ఎప్పటికీ రుణ పడి ఉంటానని తెలిపారు తమన్. `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్`, `బ్రో`, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు పనిచేయడానికి కారకులైన ఆయనకు రుణపడి ఉంటాను. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్ గారే. `అరవింద సమేత` చిత్రంతో తనకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నా మ్యూజిక్లో చాలా మార్పు వచ్చింది. చాలా పరణితి కనిపించింది. నాకు `అరవింద సమేత`కి ముందు, తర్వాత అనేలా చేశార`ని చెప్పారు. సాయిధరమ్ తేజ్ గురించి చెబుతూ, పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు అంత బాధపడ్డాను. అంత ఇష్టం సాయి అంటే. మనసుకి చాలా దగ్గరైన మనిషి. నాకు బ్రదర్ లేరు, సాయితేజ్నే బ్రదర్గా ఫీలవుతా. అందుకే సాయి తేజ్ సినిమాకి మనసుతో పని చేస్తాను. క్లయిమాక్స్ లో నా సంగీతంతో సాయి తేజ్ పై ప్రేమని చూపించాను` అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో మా మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కృతజ్ఞతలు. సముద్రఖని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన ప్రయాణాన్ని చిన్నగా మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు. ముందుముందు మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. థమన్ నేపథ్య సంగీతంతో కట్టిపడేసాడు. కళ్యాణ్ మావయ్య గురించి, త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు. త్రివిక్రమ్ నన్ను నమ్మి, నేను పూర్తిగా కోలుకునే వరకు సముద్రఖని గారిని వెయిట్ చేయించారు. `బ్రో` చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులు అందరికీ కృతజ్ఞతలు` అని చెప్పారు.
ఇక `బ్రో` బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో చిత్ర దర్శకుడు సముద్రఖని, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, హీరోయిన్ కేతిక శర్మ, దర్శకులు మారుతి, బాబీ, గోపీచంద్ మలినేని, శ్రీవాస్, చందూ మొండేటి, రైటర్లు కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.
