ఆస్కార్ పోటీలో తెలుగు షార్ట్ ఫిల్మ్.. ఏకంగా 900లకుపైగా అవార్డులు
ఈ ఏడాది నయనతార, విఘ్నేష్ శివన్లు నిర్మించిన `కూజంగల్` సినిమా భారతీయ జ్యూరి ఆస్కార్ నామినేషన్కి ఎంపిక చేసింది. తాజాగా ఓ లఘు చిత్రం కూడా ఆస్కార్ పోటీలో నిలవబోతుంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సినీ పురస్కారం `ఆస్కార్` అవార్డు. ఈ అవార్డు దక్కిందంటే ఓ సినీ మేకర్ డ్రీమ్ నెరవేరినట్టే. అలాంటి ఆస్కార్ దక్కడం అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో ఏ చిత్రానికి ఆస్కార్ దక్కలేదు. ఒకటి రెండు సినిమాలు నామినేట్ అయినా అవార్డు దక్కించుకోలేకపోయాయి. కానీ ప్రతి ఏడాది మన ఇండియన్ సినిమాలు ఆస్కార్ పోటీలో ఉండాలని ప్రయత్నిస్తుంటాయి. కానీ నామినేషన్ల ప్రక్రియలోనే వెనుదిరగాల్సి వస్తుంటుంది.
ఈ ఏడాది నయనతార, విఘ్నేష్ శివన్లు నిర్మించిన `కూజంగల్` సినిమా భారతీయ జ్యూరి ఆస్కార్ నామినేషన్కి ఎంపిక చేసింది. తాజాగా ఓ లఘు చిత్రం కూడా ఆస్కార్ పోటీలో నిలవబోతుంది. విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన షార్ట్ ఫిలిం `మనసానమః` ఆస్కార్ క్వాలిఫైలో ఉంది. ఇందులో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా `మనసానమః` షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. గతేడాది యూట్యూబ్ లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది. ఆస్కార్ క్వాలిఫైలో ఉన్న మనసానమః కు ఈ నెల 10 నుంచి ఓటింగ్ జరగబోతుంది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు దీపక్ తోపాటు నటీనటులు విరాజ్, దృషిక, సినిమాటోగ్రాఫర్ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు దీపక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రేమ కథనే కొత్తగా ఎలా తెరకెక్కించాలని ఆలోచించినప్పుడు కంప్లీట్ రివర్స్ స్క్రీన్ ప్లేతో మ్యూజికల్ గా చేద్దామని అనుకున్నాం. కథను మొత్తం రివర్స్ లో తీయడం షూటింగ్ టైమ్ లో పెద్ద ఛాలెంజ్. ప్రొడక్షన్ టైమ్ లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. మంచి టీమ్ తో అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించాం. `మనసానమః` కు ఇంటర్నేషనల్ గా వందల అవార్డులు రావడం మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంది. ఈ నెల 10న ఆస్కార్ ఓటింగ్ లోనూ విన్ అవుతామని ఆశిస్తున్నాం. నా అభిమాన దర్శకుడు సుకుమార్. త్వరలోనే ఫీచర్ ఫిల్మ్ చేయబోతున్నా` అని అన్నారు.
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ, దీపక్ `మనసానమః` కథ చెప్పినప్పుడు చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకురాగలడా అనిపించింది. కానీ షార్ట్ ఫిలిం కంప్లీట్ అయ్యాక అతని వర్క్ ఎంటో తెలిసింది. గతేడాది లాక్ డౌన్ లో యూట్యూబ్ లో రిలీజ్ చేశాం. అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక తెలుగు షార్ట్ ఫిలింకు ఇంటర్నేషనల్లీ 900 పైగా అవార్డ్స్ రావడం గర్వంగా ఉంది. ఆస్కార్ క్వాలిఫై ఓటింగ్ పై పాజిటివ్ గా ఉన్నాం` అని చెప్పారు.
హీరోయిన్ దృషిక మాట్లాడుతూ...మనసానమః సినిమాకు ఇంత రెస్పాన్స్, ఇన్ని అవార్డ్స్ రావడం నమ్మలేకపోతున్నాను. నా మొదటి సినిమాకే ఇంతలా అప్రిషియేషన్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలుగు రాదు. యాక్టింగ్ కోర్సులు చేయలేదు. కానీ కథను బిలీవ్ చేసి నటించాము. ఈ షార్ట్ ఫిలింలో నటించడం నాకు నిజంగా ఛాలెంజింగ్ గా అనిపించింది. అన్నారు. `మనసానమః` అంతర్జాతీయంగా వస్తున్న గుర్తింపునకు సంతోషాన్ని వ్యక్తం చేశారు సినిమాటోగ్రాఫర్ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్. ఆస్కార్ క్వాలిఫై అయి ఓటింగ్ లో తమ సినిమా విన్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
also read: Megastar Record: చిరంజీవి వరల్డ్ రికార్డ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. డిటెయిల్స్