ఆగస్ట్ 1 నుంచి టాలీవుడ్‌లో షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం నిర్మాణ దశలో వున్న పలువురు స్టార్ హీరోల సినిమాలు నిలిచిపోనున్నాయి. 

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుతో పాటు పలువురు నిర్మాతలు కూడా హాజరయ్యారు. భేటీకి సంబంధించిన వివరాలను కాసేపట్లో వివరించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్మాతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒకటి రెండు రోజుల్లో షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి. దీంతో చిత్రీకరణ దశలో వున్న మహేశ్ బాబు - త్రివిక్రమ్, బాలకృష్ణ - గోపీచంద్ మలినేని, శంకర్- రామ్ చరణ్, వరుణ్ తేజ్- ప్రవీణ్ సినిమాలకు బ్రేక్ పడినట్లయ్యింది. 

నిర్మాతల సమస్యల కారణంగా షూటింగ్‌లు బంద్ చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. అధిక వ్యయం భరించలేక పోతున్నామని నిర్మాతలు చెబుతున్నారు. హీరో , హీరోయిన్ల రెమ్యునరేషన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు పేమెంట్స్ భారంగా మారుతున్నాయి. అలాగే సీనియర్ సినిమాటోగ్రాఫర్స్, వారి అసిస్టెంట్లకు 5 స్టార్ లగ్జరీ సౌకర్యాలు కల్పించేలేమంటున్నారు నిర్మాతలు. ఒక్కో ఆర్టిస్ట్‌తో పాటు వచ్చే వ్యక్తిగత సిబ్బందికి రోజూ రూ.20 వేల ఖర్చు అవుతోంది. హైదరాబాద్‌లో కాంబినేషన్ షూటింగ్‌కి భయపడుతున్నారు నిర్మాతలు.