Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీలు థియేటర్లని కిల్‌ చేస్తున్నాయిః తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్‌.. అక్టోబర్‌ 30 వరకు ఆగండంటూ..

ఓటీటీలకు సినిమాలు అమ్ముకోవద్దని, అంతరించిపోతున్న థియేటర్లని కాపాడాలని, సేవ్‌ సినిమా అంటూ తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్‌ నిరసన తెలిపింది. అక్టోబర్‌ 30 వరకు నిర్మాతలు తమ సినిమాలను అమ్ముకోవద్దని వారు కోరుతున్నారు. 

telangana state film chamber believes that otts are killing theaters  arj
Author
Hyderabad, First Published Jul 7, 2021, 6:29 PM IST

ఓటీటీలకు సినిమాలు అమ్ముకోవద్దని, అంతరించిపోతున్న థియేటర్లని కాపాడాలని, సేవ్‌ సినిమా అంటూ తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్‌ నిరసన తెలిపింది. అక్టోబర్‌ 30 వరకు నిర్మాతలు తమ సినిమాలను అమ్ముకోవద్దని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఎగ్జిబిటర్ల ప్రధానంగా నడిచే తెలంగాణస్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్‌ బుధవారం మీడియా ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో  సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ, `అక్టోబర్‌ 30 వరకు  నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మవద్దని రిక్వెస్ట్‌ చేస్తున్నాం. ఆ తరువాత కూడా బాగా లేదంటే ఓటీటీలకు అమ్ముకోండి` అని అన్నారు.

తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ, `ఆగస్ట్‌ మొదటి వారంలో అంతా సద్దుమణిగేట్టు కనిపిస్తోంది. చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే పర్లేదు, కనీసం పెద్ద వాళ్లు అయినా కూడా విడుదల ఆపుకోవాలి.  కనీసం అక్టోబర్‌ 30 వరకైనా ఆపుకోండి.  సినిమాను కాపాడండి. ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. నేను కూడా నిర్మాతనే. నాక్కూడా ఆ బాధలు తెలుసు. నిర్మాత కంటే డిస్ట్రిట్యూబర్స్, ఎగ్జిబిటర్స్‌ ఎక్కువ బాధలు పడుతున్నారు.  అందుకని, ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. ఒకవేళ అక్టోబర్ 31వరకు థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడు ఇచ్చుకోండి. 

మేం నిర్మించిన 'లవ్ స్టోరీ' సినిమాకు పది ఆఫర్లు వచ్చాయి. అయినా ఓటీటీలకు ఇవ్వలేదు. మా రిక్వెస్ట్‌ను నిర్మాతలందరూ వింటారని అనుకుంటున్నాను. నమస్కారం పెట్టి మరీ రిక్వెస్ట్‌ చేస్తున్నాను. హీరోలకు కూడా ఓటీటీలకు సినిమాలు ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళు మాకు మద్దతు ఇస్తారు. థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీలు 40, 50 కోట్ల ఆఫర్లు ఇవ్వవు. థియేటర్స్ ప్రజెంట్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అంత అమౌంట్ ఇస్తున్నాయి. అందుకని, అక్టోబర్ వరకు వెయిట్ చేయండి` అని అన్నారు.

తెలంగాణ థియేటర్స్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, `ఓటీటీ చట్టం కల్పించిన హక్కు కానే కాదు. సినిమాలను ఎవ్వరికైనా అమ్ముకోడం నిర్మాత హక్కు. సినిమాలు రిలీజైన పది వారాలకో ఎప్పుడో ఓటీటీకి అమ్ముకోవాలనే కండీషన్ తో పది కోట్లకో ఇరవై కోట్లకో డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కున్న రోజునే అగ్రిమెంట్లో ఎంటర్‌  చేస్తే.. మా ఛాంబర్‌ చర్య తీసుకుంటుంది.   నిర్మాతలం మాకు హక్కు ఉంటుందని కాకుండా.. అక్టోబర్‌ వరకు ఎదురు చూడండి. థియేటర్ వ్యవస్థను ఓటీటీలు కిల్ చేయడానికి చూస్తున్నాయి. ఈ రోజు మమ్మల్ని కిల్ చేస్తే రేపు నిర్మాతలను కిల్ చేస్తాయి. నిర్మాతలకు వెంటనే షేర్ ఇచ్చేది మేమే` అని అన్నారు.

అభిషేక్‌ నామా మాట్లాడుతూ, `ఈ పాండమిక్‌ వల్ల  అందరూ ఎంత బాధ పడ్డారో అందరం చూశాం. అందరి కంటే ఎక్కువగా కష్టాలు పడింది సినిమా పరిశమ్రకు చెందిన వాళే. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో కోలుకుంటున్నాయి. కానీ ఒక్క సినీ ఇండస్ట్రీ మాత్రం ఇంకా అలానే ఉంది. ప్రతీ శుక్రవారం రాగానే థియేటర్ల వద్ద సందడి కనిపించేది. కానీ ఇప్పుడు అది లేదు. ఓటీటీ వచ్చి ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోను తీసేసింది. నిర్మాతలకు మంచి అమౌంట్‌ ఇచ్చి సినిమాలను తీసేసుకుంటున్నారు. 

అయితే థియేటర్లో సినిమా రిలీజ్‌ చేసిన ఆ తరువాత ఓ 20  రోజులకు ఓటీటీకి ఇస్తే అందరూ బాగుంటారు. థియేటర్లో టిక్కెట్‌ ఇచ్చే వ్యక్తి నుంచి ఎంతో మంది ఆధారపడి ఉన్నారు. అందరి సపోర్ట్‌ లేకపోతే దీన్ని మనం ముందుకు తీసుకెళ్లలేమ`ని అన్నారు.  

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ,  భవిష్యత్ అంతా కూడా సినిమా పరిశ్రమదే, థియేటర్లదే. ఫ్యామిలీలు అంతా కూడా సినిమాకు వెళ్లాలంటే పిక్నిక్ టైప్ ప్లానింగ్ చేసుకుంటున్నాయి. ఇంట్లో కూర్చుని చూస్తుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటే వాళ్లకి సినిమా ఏం అర్థమవుతుంది. ఇంకా 25 ఏళ్లు అయినా 50 ఏళ్లు అయినా కూడా థియేటర్ బతికే ఉంటుంది` అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎగ్జిబిటర్ సదానంద గౌడ్, సుధా థియేటర్ అనుపమ్ రెడ్డి సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios