తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన మిరాయ్ చిత్ర టీజర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. టీజర్ లో విజువల్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి.
'హను మాన్' చిత్రం తర్వాత యువ హీరో తేజ సజ్జా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తేజ సజ్జా నటించిన తాజా చిత్రం మిరాయ్ భారతదేశం సహా అంతర్జాతీయ స్థాయిలో పలు భాషల్లో సెప్టెంబర్ 5, 2025న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ఫాంటసీ అడ్వెంచర్ కథలో తేజ సజ్జా సూపర్ యోధాగా, అత్యంత శక్తివంతమైన విలన్ మంచు మనోజ్ తో తలపడుతున్నాడు. టీజర్ లో కథ గురించి కొన్ని హింట్స్ ఇచ్చారు. జరగబోయేది మారణ హోమం, శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీనిని అడ్డుకోలేదు అంటూ సాగే డైలాగులతో టీజర్ ప్రారంభం అవుతుంది. జరిగే మారణ హోమాన్ని అడ్డుకోవాలంటే సూపర్ యోధా అయిన హీరోకి ఒక ఆయుధం కావాలి. అతీత శక్తులు కలిగిన ఆ ఆయుధమే మిరాయ్. దానిని తేజ సజ్జా ఎలా దక్కించుకున్నాడు. విలన్ తో పోరాడే క్రమంలో తేజ సజ్జాకి ఎదురైనా సవాళ్లు ఏంటి ? అనేది సినిమా రిలీజ్ అయ్యాక తేలనుంది. టీజర్ చివర్లో తేజ సజ్జా ఒక స్టిక్, 9 పుస్తకాలు, 100 ప్రశ్నలు, బిగ్ అడ్వెంచర్ అంటూ చెబుతున్న డైలాగ్స్ ఆసక్తిని పెంచేస్తున్నాయి.
పైకి సూపర్ హీరోగా చిత్రంగా భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం కనిపిస్తున్నప్పటికీ.. అంతర్లీనంగా దైవ భక్తి, చరిత్రకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటిని దర్శకుడు ఎంత పర్ఫెక్ట్ గా మిళితం చేశాడు అనే దానిపై ఈ చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.
టీజర్ లో విజువల్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. రైలుపై సాగే సీన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీయ శరన్, జయరామ్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.