దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో మరణించడం తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
కోలీవుడ్ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుకుమారన్(45) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
మధురైలో ఓ నిర్మాతను కలిసి కొత్త సినిమాకి సంబంధించిన కథను చర్చించి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తుండగా విక్రమ్ సుకుమారన్కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన బస్సులోనే మరణించారు. ఆయన మరణం తమిళ చిత్ర పరిశ్రమని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. .
ఎవరీ విక్రమ్ సుకుమారన్?
రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన విక్రమ్ సుకుమారన్ సినిమాపై ఆసక్తితో చెన్నైకి వచ్చారు. 1999-2000 ప్రాంతంలో దర్శకుడు బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. బాలు మహేంద్ర దర్శకత్వంలో 2003లో వచ్చిన `జూలీ గణపతి` చిత్రానికి కూడా విక్రమ్ సుకుమారన్ పనిచేశారు.
సుధీర్ఘ ప్రయాణం తర్వాత దర్శకుడైన విక్రమ్ సుకుమారన్
దర్శకుడిగా ఛాన్స్ లు దొరక్కపోవడంతో నటుడిగా మారారు విక్రమ్ సుకుమారన్. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన `పొల్లదావన్` చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత శశికుమార్` కొడివీరన్` చిత్రంలో నటించిన ఆయనకు 2013లో దర్శకత్వం వహించే అవకాశం లభించింది.
కాతిర్, ఓవియా నటించిన ‘మధ యెన్నై కూట్టమ్’ చిత్రం ద్వారా దర్శకుడిగా కోలీవుడ్లో అడుగుపెట్టారు విక్రమ్ సుకుమారన్. మొదటి చిత్రమే గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు. విభిన్నమైన కథా, కథనంతో ఈ మూవీని రూపొందించి దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. విశేష ప్రశంసలందుకున్నారు.
`మధ యెన్నై కూట్టమ్` చిత్రం విజయం తర్వాత ఆయన రెండవ చిత్రం `రావణ కోట్టం` 2023లో విడుదలైంది. ఆ మూవీలో శాంతను హీరోగా నటించారు.
ఇది భూమికి సంబంధించిన కథ కావడంతో, వర్షాకాలంలో మాత్రమే చిత్రీకరించారు విక్రమ్ సుకుమారన్. సంవత్సరంలో కేవలం 3 నెలలు మాత్రమే చిత్రీకరణ జరిపారు. ఈ మూవీకి కూడా మంచి ఆదరణ దక్కింది.
మూడో సినిమాకి దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతుండగా విషాదం
తన కథకు ప్రాణం పోయడానికి అవిశ్రాంతంగా శ్రమించే సుకుమారన్ తన మూడవ చిత్రం ‘తేరుమ్ పోరుమ్’కి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతుండగా గుండెపోటుతో మరణించడం అత్యంత బాధాకరం. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు.
విక్రమ్ సుకుమారన్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు. అంతేకాకుండా ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ దుఃఖంలో మునిగిపోయింది. ఆయన మరణానికి ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.