సారాంశం
బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `స్వాతిముత్యం`. ఈ సినిమా దసరాకి విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. అందుకే డేట్ ఫిక్స్ అయ్యింది.
నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రం `స్వాతిముత్యం`. దిగ్గజ నటుడు కమల్ హాసన్ క్లాసిక్ మూవీ `స్వాతిముత్యం` పేరుతో వస్తున్న చిత్రం కావడంతో అంతా అటెన్షన్ నెలకొంది. ఇందులో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కింది. దసరా కానుకగా ఈ సినిమా విడుదలైంది. మంచి ఆదరణ పొందింది. రెండు పెద్ద సినిమాలు (గాడ్ ఫాదర్, ది ఘోస్ట్)ల మధ్య విడుదలై ఫర్వాలేదనిపించుకుంది.
తాజాగా ఈ సినిమా ఓటీటీలో రాబోతుంది. ఈ నెల 28న `ఆహా`లో `స్వాతిముత్యం` స్ట్రీమింగ్ కానుందని యూనిట్ వెల్లడించింది. అయితే ఇటీవల ఫిల్మ్ ఛాంబర్లో ఒక సినిమా విడుదలయ్యాక పది వారాలు(రెండు నెలలు) తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం కేవలం మూడు వారాల గ్యాప్లోనే రిలీజ్ కాబోతుండటం విశేషం. చిన్న సినిమా కావడం, వెంటనే థియేటర్ల నుంచి వాష్ ఔట్ కావడంతో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు టాక్.
ఈ సినిమా స్మెర్మ్ డొనేషన్ నేపథ్యంలో రూపొందిన విషయం తెలిసిందే. స్పెర్మ్ డొనేషన్ అనే కథని అంతర్లీనంగా చెబుతూ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు లక్ష్మణ్ కె కృష్ణ. స్వాతిముత్యం లాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో అతని జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాల నడుమ జీవిత ప్రయాణం ఎలా సాగిందనేది ఈ చిత్ర కథ. అక్టోబర్ 5న సినిమాకి మంచి టాక్ వచ్చినా, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేకపోవడం విచారకరం.