ధోని బయోపిక్ కు సీక్వెల్ రాబోతుందా?
ఎం.ఎస్.ధోని సినిమాకు సీక్వెల్ రాబోతుందనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ధోని సినిమాలో హీరోగా కనిపించిన సుశాంత్ రాజ్ పుత్ సీక్వెల్ లో కూడా నటించే అవకాశం ఉంది
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని జీవితం ఆధారంగా 'ఎం.ఎస్.ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో పాటు విమర్శకుల ప్రసంశలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ధోని సినిమాలో హీరోగా సుశాంత్ రాజ్ పుత్ కనిపించిన సంగతి తెలిసిందే. అతడికి ఈ సినిమా తరువాత ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఇప్పుడు సీక్వెల్ లో కూడా అతడినే హీరోగా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అతడితో చర్చలు జరుపుతున్నారు. మొదటి పార్ట్ లో ధోని టీమ్ ప్రపంచ కప్ ఎలా గెలించిందనే వరకు సినిమాలో చూపించారు. వ్యక్తిగత జీవితంపై కూడా దృష్టి పెట్టారు. అయితే ఈసారి 2011లో కప్ గెలిచిన తరువాత ధోని జీవితంలో చోటు చేసుకున్న ముఖ్య ఘట్టాలను సీక్వెల్ లో చూపించబోతున్నారని సమాచారం.
మొదటి భాగాన్ని ఎంత నిజాయితీగా తెరకెక్కించారో.. సీక్వెల్ ను అంతే నిజాయితీగా వాస్తవానికి దగ్గరగా చూపించబోతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. వచ్చే ఏడాదిలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి పార్ట్ ను నీరజ్ పాండే డైరెక్ట్ చేశారు. మరి సీక్వెల్ ఎవరు చేతుల్లోకి వెళ్తుందో చూడాలి!