సినీ హీరో సూర్యకు కరోనా.. హాస్పిటల్లో..
తమిళ స్టార్ హీరో సూర్య కరోనా బారిన పడ్డారు. ఈయనకు కోవిడ్ పాజిటివ్ అని నిర్దారణ పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని హీరో సూర్య తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను.ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాను. మన జీవితాలు ఇంకా సాధారణ స్థితికి రాలేదు . భయం వద్దు. అదే సమయంలో భద్రత మరియు శ్రద్ధ అవసరం. కరోనా నుంచి కోలుకోవడానికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు ’’ అని తెలియజేస్తూ హీరో సూర్య ట్వీట్ చేశారు. తనను కలిసిన మిత్రులు అందరూ చెకప్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.
హీరో సూర్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తెలుగు,తమిళ నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. అలాగే సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తన 40వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రీసెంట్గా లాంఛనంగా ప్రారంభమైంది. షూటింగ్స్, ఇతర పనులపై బయటకు వచ్చినప్పుడు సూర్యకు కోవిడ్ సోకి ఉండవచ్చుని భావిస్తున్నారు.
తమిళ ప్రేక్షకులతోపాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరోల్లో సూర్య ఒకరు. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ సూర్యకు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఆకాశం నీ హద్దురా!’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎయిర్డెక్కన్ వ్యవస్థాపకుడు జీ.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.