రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు
- రజినీకాంత్, శంకర్ ల రోబో 2.0 మానియా
- రిలీజ్ దగ్గరపడుతుండటంతో వాల్డ్ టూర్
- రజినీ, అక్షయ్ ల మేకప్ కు కోట్ల రూపాయల ఖర్చు
- రోబో 2.0లో ఒక్క పాటకు 32కోట్ల రూపాయల ఖర్చు
సూపర్ స్టార్ రజినీ కాంత్, ఎన్.శంకర్ ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0 చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోబో చిత్రంలో రజనీకాంత్ ఐదు గెటప్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక రోబో గెటప్ కోసం రజనీ ఫేస్ మాస్కులు తయారు చేశారు. రజనీ ఫేస్కి కెమికల్స్ అప్లై చేసి, అది ఎండిన తర్వాత తీస్తే, వచ్చేదే మాస్క్. దీనికోసం రజనీ నాలుగైదు గంటలు కేటాయించాల్సి వచ్చింది. సూపర్ స్టార్ రజినీ వయసు దాదాపు 65. ఈ ఏజ్లో అన్నేసి గంటలు కదలకుండా కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు.
‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్', ‘ఐరన్ మాన్', ‘లైఫ్ ఆఫ్ పై' తదితర హిట్ సిన్మాలకు పని చేసిన హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ రజనీ- అక్షయ్ల స్పెషల్ గెటప్స్ మేకప్ చేశారు. విలన్ గా కనిపించనున్న అక్షయ్ కుమార్ మేకప్ కూడా చాలా ఖరీదైనదేనట. ఈ విలన్ సినిమాలో పక్షులని ఇష్టపడతాడట. అందుకే పక్షులు పలు రకాలు కదా. ఈ పక్షి ప్రేమికుడి గెటప్ని కూడా పలు రకాల పక్షులను తలపించే రీతిలో ప్లాన్ చేశారట. ఉదాహరణకు కనుబొమ్మలు ఓ పక్షిలా, చేతి గోళ్లు మరో పక్షిలా, జుత్తు ఓ పక్షిని పోలినట్లుగా, మీసాలు మరో పక్షిలా... ఇలా అక్షయ్ గెటప్ని మార్చారు.
అక్షయ్ మేకప్కి నాలుగైదు గంటలు పట్టేదట. ఒక్కసారి మేకప్ వేశాక ‘నో సాలిడ్ ఫుడ్'. ‘ఓన్లీ లిక్విడ్స్'. జ్యూసులు, నీళ్లు, పాలు లాంటివి. అందుకే ఎక్కువ గంటలు షూటింగ్ చేసేవారు కాదని సమాచారం. ఇంతకీ అక్షయ్ పారితోషికం ఎంతో తెలుసా? రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఈ సినిమాకి ఆయన అక్షరాలా 50 కోట్లకు చెక్కు పుచ్చుకున్నారట. మామూలుగా హిందీలో హీరోగా నటించే సినిమాలకు అక్షయ్ 50 నుంచి 70 కోట్లు తీసుకుంటారని భోగట్టా.
ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు వచ్చిన మరో న్యూస్ పిచ్చెక్కించేలా ఉంది ప్రపంచ సినీ చరిత్రలో కాస్ట్లీయెస్ట్ పాట ఇప్పుడు ఈ సినిమాలోనే ఉంది. ఈ ఘనత '2.0' టీంకే చెందనుంది. తన సినిమాల్లో పాటలకు భారీగా ఖర్చు చేయడం అలవాటైన శంకర్.. ఈ సినిమాలో ఒక పాటకు ఏకంగా రూ.32 కోట్లు ఖర్చు పెట్టించేశారట.
ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిస్తూ భారీ స్థాయిలో రోబోలను చూపిస్తూ.. వాటి మధ్య రజినీ-అమీ జాక్సన్ల మీద ఈ పాట తీసినట్లు సమాచారం. ఇప్పటిదాకా 'ధూమ్-3' సినిమాలోని ఒక పాటకు రూ.5 కోట్లు ఖర్చు చేయడమే ఇప్పటిదాకా రికార్డు. దానికి ఆరు రెట్లకు పైగా ఖర్చుతో '2.0'లో ఒక పాటను చిత్రీకరించాడట శంకర్.
ఈ పాట కళ్లు చెదిరిపోయేలా ఉంటుందని.. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుందని అంటున్నారు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు రెహమాన్ ఐదు పాటలు రికార్డ్ చేసినప్పటికీ.. సినిమాలో కనిపించేది రెండు పాటలేనట. మిగతా పాటలూ పెడితే నిడివి పెరిగిపోతుందని భావించి.. రెండు పాటలకే పరిమితం చేశాడట శంకర్. ఆ రెండు పాటలూ కూడా అద్భుత రీతిలో ఉండేలా శంకర్ చిత్రీకరించాడట. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.