తెలిసింది గోరంత తెలియంది కొండంత.... కాంతార మూవీపై సూపర్ స్టార్ కామెంట్!
కాంతార మూవీ సంచలనాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న కాంతార రికార్డు వసూళ్లు రాబడుతుంది. అదే సమయంలో సూపర్ రజినీకాంత్ కాంతార చిత్రాన్ని ఉన్నదేశిస్తూ ట్వీట్ చేయడం విశేషంగా మారింది.
కాంతార చిత్రం చూసిన ప్రముఖులు, సామాన్యులు అద్భుతం అంటూ అభివర్ణిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేరారు. కాంతార చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ఆయన ట్వీట్ చేశారు. రజినీకాంత్ తన ట్వీట్ లో... తెలిసింది గోరంత తెలియంది కొండంత. ఈ విషయాన్ని హోమ్బలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన కాంతార చిత్రంలో చెప్పినంత గొప్పగా మరొకరు చెప్పలేరేమో. ఈ సినిమా నా రోమాలు నిక్కబొడిచేలా చేసింది. నటుడు, రచయిత, దర్శకుడు బాధ్యతలు నెరవేర్చిన రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. ఇలాంటి మాస్టర్ పీస్ ఇండియన్ సినిమాకు అందించిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు... అంటూ కామెంట్ చేశారు.
కాంతార మూవీని మాస్టర్ పీస్ గా అభివర్ణించిన రజినీకాంత్... అద్భుత చిత్రాన్ని చూశానన్న భావన వెలిబుచ్చారు. ఇక రజినీకాంత్ ట్వీట్ కి హీరో రిషబ్ శెట్టి స్పందించారు. లెజెండరీ సూపర్ స్టార్ అయిన మీరు నా చిత్రాన్ని పొగడటంతో నా కల నెరవేరింది. చిన్నప్పటి నుండి నేను మీ అభిమానిని. మీ ప్రశంసలు మరిన్ని స్థానిక కథలు తెరపైకి తేవడానికి స్ఫూర్తిని ఇచ్చింది అంటూ... ట్వీట్ చేశారు.
కాంతార తమిళంలో కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో రజినీకాంత్ ట్వీట్ చిత్రానికి మరింత ప్రచారం తెచ్చిపెడుతుంది. వరల్డ్ వైడ్ కాంతార రూ. 200 కోట్ల వసూళ్లు దాటేసింది. ఇక తెలుగులో సంచలనాలు నమోదు చేస్తుంది. కాంతార తెలుగు రాష్ట్రాల్లో 11 రోజులకు సుమారు రూ.16 కోట్ల షేర్, రూ. 29 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నిర్మాత అల్లు అరవింద్ కాంతార తెలుగు హక్కులు కేవలం రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ లెక్కన కాంతార ఆయనకు ఎంత మొత్తంలో లాభాలు తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాంతార వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి.