సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు రమేశ్ బాబు కన్నుమూశారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ బాబు ఆరోగ్యం శనివారం క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 

సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు రమేశ్ బాబు కన్నుమూశారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ బాబు ఆరోగ్యం శనివారం క్షీణించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 

కృష్ణ, ఇందిరాదేవిలకు 1965అక్టోబర్‌ 13న చెన్నైలో ఆయన జన్మించారు. రమేష్‌బాబు తర్వాత మంజుల, పద్మావతి, ప్రియదర్శిని, మహేష్‌బాబు జన్మించారు. రమేష్‌ బాబు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఇందిరాదేవి రూపులో ఉండే ఆయనకు చిన్నప్పుడు యమ క్రేజ్‌. కృష్ణ నటించిన ఐకానిక్‌ మూవీ `అల్లూరి సీతారామరాజు` చిత్రంతో బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు రమేష్‌బాబు.  అప్పటికి ఆయన వయసు కేవలం తొమ్మిదేళ్లు. ఈ సినిమాలో బాల అల్లూరిగా నటించి మెప్పించారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. 

ఆ తర్వాత కృష్ణ నటించిన `మనుషులు చేసిన దొంగలు` చిత్రంలో బాలనటుడిగా మెప్పించారు. ఆ తర్వాత `నీడ` సినిమాలో మెప్పించారు. ఇందులో మహేష్‌బాబు కూడా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. వీటితోపాటు `దొంగలకు దొంగ`, `అన్నదమ్ముల సవాల్‌`, `నీలు` చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు.  టీనేజ్‌లోకి వచ్చిన రమేష్‌ బాబు ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తండ్రి కృష్ణ సారథ్యంలో ఆయన హీరోగా ఎంట్రీ జరిగింది. 

1987లో `సామ్రాట్‌` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రమేష్‌బాబు. దీనికి వి మధుసుధన్‌ రావు దర్శకత్వం వహించారు.  తొలి చిత్రంతో ఫర్వాలేదనిపించుకున్నారు రమేష్‌బాబు. ఆ తర్వాత కామెడీ బ్రహ్మాగా పేరు తెచ్చుకున్న జంధ్యాల దర్శకత్వంలో `చిన్ని కృష్ణుడు` చిత్రంలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కోదండరామిరెడ్డి రూపొందించిన `బజార్‌ రౌడీ` చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు. హీరోగా ఆయనకు ఇది మంచి బ్రేక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. 

ఆ తర్వాత `కలియుగ కర్ణుడు`, `ముగ్గురు కొడుకులు` చిత్రాలు కృష్ణ దర్శకత్వంలో నటించారు. `ముగ్గురు కొడుకులు` చిత్రంలో కృష్ణ, మహేష్‌లతో కలిసి నటించారు. దాసరి దర్శకత్వంలో `బ్లాక్‌ టైగర్‌`, `వి మధుసుధన్‌ రావు దర్శకత్వంలో `కృష్ణ గారి అబ్బాయి`,తోపాటు `ఆయుధమ్‌`, `కలియుగ అభిమన్యుడు`, `నా ఇల్లే నా స్వర్గం` వంటి చిత్రాలతో విజయాలను అందుకున్నారు రమేష్‌బాబు. వీటితోపాటు `మామ కోడలు`, `అన్నా చెల్లెలు`, `పచ్చతోరణం` సినిమాలు చేశారు. చివరగా ఆయన `ఎన్‌కౌంటర్‌` చిత్రంలో సపోర్టింగ్‌ రోల్‌ చేశారు. 

హీరోగా చేసిన రమేష్‌బాబు సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్‌ కాలేదు. వరుసగా పరాజయం చెందాయి. కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయాయి. దీంతో హీరోగా సినిమాలు తగ్గించారు. తాను హీరోగా సెట్‌ కాలేననుకుని ఆయన సపోర్టింగ్‌ రోల్స్ వైపు మొగ్గు చూపారు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడం, అదే సమయంలో రమేష్‌బాబు బరువెక్కడంతో ఆయన్ని తెరపై చూడటం కష్టంగా మారింది. దీంతో తనకు తానే సినిమాలకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత ప్రొడక్షన్‌ వైపు మొగ్గు చూపారు.