బాహుబలితో యమా క్రేజ్ సంపాదించుుకున్న రాజమౌళి అమరావతి ఆర్కిటెక్చర్ మాహిష్మతిని పోలి వుండాలని సీఎం యోచన అమరావతి నిర్మాణంలో రాజమౌళిని భాగస్వామిని చేసిన చంద్రబాబు తనది కేవలం మీడియేషన్ చేసే పాత్ర తప్ప మరేంకాదంటున్న జక్కన్న
ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో తనను ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్సల్టెంట్గా నియమించారన్న ప్రచారాన్ని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఖండించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్టు పెట్టారు. అమరావతి విషయంలో తను కన్సల్టెంట్ గా, డిజైనింగ్ సూపర్ వైజర్ గా నియమితం అయినట్టుగా వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన స్పష్టం చేశారు.
‘ఫోస్టర్, పార్టనర్స్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నిర్మాణ సంస్థ. వాళ్లు సమర్పించిన డిజైన్లు ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయని నాకు అనిపిస్తోంది. ఆ డిజైన్ల పట్ల చంద్రబాబుగారు, ఆయన టీమ్ చాలా ఆనందంగా ఉంది. అయితే వారు భవనాలు మరింత ఐకానిక్ గా ఉండాలని అనుకుంటున్నారు. నా పనల్లా.. బాబుగారి ఆలోచనలను ఫోస్టర్స్ తో పంచుకుని.. పని త్వరగా పూర్తయ్యేలా చూడటమే. ఈ ఎపిక్ ప్రాజెక్టులో స్వల్పమే అయినా నా భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఆశ..’ అని రాజమౌళి ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.
అలా రాజధాని డిజైన్ల ఎంపిక విషయంలో తన ప్రమేయం గురించి స్పష్టంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు జక్కన్న. మరోవైపు ఏపీ నూతన రాజధాని నిర్మాణం డిజైన్ల విషయంలో సినిమా దర్శకుడి ప్రమేయంపై విమర్శలు తప్పడం లేదు. తనకు ఆర్కిటెక్చర్ గురించి ఎలాంటి అవగాహన లేదని ఇది వరకూ స్వయంగా రాజమౌళి స్పష్టం చేసిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో బాబు ప్రభుత్వంపై సెటైర్లు పడుతున్నాయి. రాజధాని నిర్మాణం డిజైన్లకు రాజమౌళి సహకారం తీసుకుంటున్నారు. మరి రేపు పాక్ తోనో, చైనాతోనో యుద్ధం వస్తే.. ప్రభాస్ ను పంపిస్తారా? అని కొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
