నడిగర్ తిలకం శివాజీ గణేషన్ కుటుంబంలో ఆస్థి చిచ్చు రేగింది. తమిళనాట స్టార్ హీరోగా వెలుగొందిన పెద్దాయన పిల్లలు ఆస్థి కోసం కోర్టుకు ఎక్కే పరిస్థితి వచ్చింది. తమను మోసం చేశారంటూ.. శివాజీ గణేశన్ కూతుర్లు కోర్టు గుమ్మం తొక్కారు.
అలనాటి అందాల దిగ్గజ నటుడు, తమిళ నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు తమిళనాటే కాకుండా ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. ఇక శివాజీ గణేశన్ తరువాత ఆయన ఫ్యామిలీ నుంచి ప్రభు హీరోగా ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డాడు. ఆయన పెద్ద కొడుకు రామ్ కుమార్ నిర్మాతగా మారారు. శివాజీ గణేశన్ మరణం అనంతరం ఆయన వారసత్వం నిలబడుతుంద అనుకున్న టైమ్ లో కుటుంబంలో ఆస్తి చిచ్చు రేగింది.
శివాజీ గణేశన్ మరణించిన రెండు దశాబ్దాల తర్వాత కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తన తండ్రి ఆస్తిలో తనకు వాటా ఇవ్వలేదంటూ..శివాజీ కూతుర్లు కోర్టుకెక్కారు. నటుడు ప్రభు, నటుడు, నిర్మాత రామ్కుమార్ లపై తోబుట్టువులు శాంతి, రాజ్వీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తి విషయంలో తమకు అన్యాయం చేశారంటూ.. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తమ తండ్రి శివాజీ మరణం తర్వాత 271 కోట్ల ఆస్తిని సరిగా పంచలేదని... తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని కోర్టులో వారు వివరంగా తెలియజేస్తూ.. పిటీషన్ దాఖలు చేశారు. తమకు తెలియకుండానే ఆస్తులను అమ్మేశారని అది చెల్లదని ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు. వెయ్యి సవర్ల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను సోదరులు ప్రభు, రామ్కుమార్ అపహరించారని పిటిషన్లో వారు పేర్కొన్నారు. ఇంక వారి సోదరులపై మరిన్ని ఆరోపణలు చేశారు.
అంతే కాదు శాంతి థియేటర్లో ఉన్న 82 కోట్ల విలువైన వాటాలను వారు తమ పేరున మార్చుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ తండ్రి రాసినట్టు చెబుతున్న వీలునామా నకిలీదని పేర్కొన్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారని ఆరోపించారు. ఈ కేసులో ప్రభు, రామ్కుమార్ల కుమారులు విక్రమ్ ప్రభు, దుష్యంత్లను కూడా ప్రతివాదులుగా ఇందులో చేర్చారు.
