సింగర్ సోనూ నిగమ్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై సెటైర్లు వేశారు అంటూ సోషల్ మీడియాలో ఊహించని రచ్చ మొదలైంది. కానీ అసలు నిజం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు.
ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ మళ్ళీ కన్నడ భాష గురించి ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చేసిన కొన్ని ట్వీట్స్ ఆధారంగా ఈ వార్తలు వ్యాపించాయి. కానీ నిజం వేరు. గాయకుడు సోనూ నిగమ్ పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్స్ అసలు ఆయనవి కావు. ప్రముఖ మీడియా సంస్థలు సైతం తేజస్వి సూర్యపై ట్వీట్స్ చేసిన వ్యక్తి సింగర్ సోనూ నిగమ్ అని పొరపాటు పడ్డారు. అవి క్రిమినల్ న్యాయవాది అయిన సోనూ నిగమ్ సింగ్ చేసిన ట్వీట్స్. ఈ విషయాన్ని సోనూ నిగమ్ సింగ్ స్వయంగా ధృవీకరించారు. “ఇది చాలా తప్పు. అవి నా మాటలు, నా అభిప్రాయం, కానీ క్రెడిట్ మరొకరికి ఇస్తున్నారు. మీడియా మిత్రులారా, ఇది చాలా అన్యాయం” అని ఆయన అన్నారు.
అసలు ఏం జరిగింది? ఆ ట్వీట్స్ ఏంటి?
సోనూ నిగమ్ సింగ్, బిజెపి ఎంపీ తేజస్వి సూర్యపై విమర్శలు చేశారు. కర్ణాటకలోని ఒక బ్యాంక్ లో కస్టమర్ కన్నడలో మాట్లాడుతున్నారు. కానీ బ్యాంక్ ఉద్యోగి మాత్రం కస్టమర్ తో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న వీడియోను తేజస్వి సూర్య షేర్ చేశారు. బ్యాంక్ ఉద్యోగి ప్రవర్తనను తప్పుబట్టి, స్థానిక భాష (కన్నడ) తెలిసి ఉండాలని తేజస్వి సూర్య అన్నారు. దీనిపై సోనూ నిగమ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సోనూ నిగమ్ సింగ్ ట్వీట్స్, గాయకుడివి అనుకున్నారు
సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా కన్నడ తప్పనిసరి చేయాలి. అమెరికన్ క్లయింట్స్ కర్ణాటకలో ప్రాజెక్టులు చేయాలంటే కన్నడలో మాట్లాడాలి. దీనిపై రాజీ పడకూడదు. సరేనా తేజస్వి సూర్య గారూ? అని సోనూ నిగమ్ సింగ్ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
బీహార్ ఎన్నికల్లో తేజస్వి గారు భోజ్పురి, మైథిలి, మగహి, బజ్జిక, ఠేఠీ లేదా అంగికలో ప్రజలతో మాట్లాడతారా? మోడీజీ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' అంటున్నారు, కానీ ఈయనలాంటి వాళ్ళు భాష, ప్రాంతం పేరుతో దేశాన్ని విడగొడుతున్నారు అని ప్రశ్నించారు.
తేజస్వి సూర్య జాతీయవాదంపై సందేహం వ్యక్తం చేస్తూ, బిజెపి లాంటి జాతీయ పార్టీ తేజస్వి సూర్యను రెండోసారి ఎంపీగా గెలిపించింది. కానీ ఆయనలో జాతీయవాదం లేదు. భాషాభిమానం, ప్రాంతీయత, కులతత్వం లాంటి నీచమైన ఆలోచనలు ఉన్నాయి. బీహార్ తేజస్వి అయినా, కర్ణాటక తేజస్వి అయినా ఇద్దరూ ఒకటే అని విమర్శించారు.
కన్నడ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. కన్నడ సినిమాలను పాన్ ఇండియా రిలీజ్ చేయకండి. కన్నడ స్టార్స్ కి ఇలా చెప్పే ధైర్యం ఉందా తేజస్వి సూర్య గారూ? అని ప్రశ్నించారు. మొత్తంగా న్యాయవాది సోనూ నిగమ్ సింగ్ చేసిన ట్వీట్స్ ని మీడియా, నెటిజన్లు సింగర్ సోనూ నిగమ్ అని భావించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ జరిగింది. నిజం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు.