శరవేగంగా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించిన మేకర్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లముడి డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చారిత్రాత్మకచిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఆయా కారణాలతో ఆలస్యం అయ్యింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్, తదితర కారణాలతో చిత్ర నిర్మాణం నెమ్మదిగా సాగింది. ఒకానొక దశలో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయాల్లో ఎప్పటికప్పుడు మేకర్స్ స్పందిస్తూ అప్డేట్ ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
హరిహర వీరమల్లు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రం. ఇలాంటి సినిమాను రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో 'హరి హర వీరమల్లు' చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
'హరి హర వీరమల్లు' ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నామని అన్నారు. వచ్చే ఏడాది ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం అనంతరం పవన్ కళ్యాణ్ - దర్శకుడు హరీశ్ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ రూపుదిద్దుకోనుంది.
ఇక ‘హరి హర వీరమల్లు’ చిత్ర కథ 17వ శతాబ్దంలోని మొఘల్ ల సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లముడి (Krish) అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఆడిపాడతోంది. అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.