తెలుగు డైరెక్టర్ తో బాలీవుడ్ బాద్ షా!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి ఈ మధ్య కాలంలో ఏది కలిసి రావడం లేదు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి ఈ మధ్య కాలంలో ఏది కలిసి రావడం లేదు. ఆయన నటిస్తోన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'జీరో' సినిమా కూడా బోల్తా కొట్టడంతో షారుఖ్ ఆలోచనలో పడ్డాడు.
తన తదుపరి సినిమాల విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. అందుకే రాకేశ్ శర్మ బయోపిక్ 'సారే జహాసే అచ్చా' సినిమాను కూడా పక్కన పెట్టేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో షారుఖ్ ఓ తెలుగు దర్శకుడితో కలిసి పని చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు', 'సైజ్ జీరో' వంటి సినిమాలను రూపొందించాడు. కానీ ఆ సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం ప్రకాష్ బాలీవుడ్ లో కంగనా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో 'మెంటల్ హై క్యా' అనే సినిమాను రూపొందిస్తున్నాడు.
ఈ సినిమాలో షారుఖ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కథలో తన పాత్ర కీలకం కావడంతో ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తోంది. మానసిక వికలాంగుల నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే సినిమా టైటిల్ మానసిక వికలాంగులను అవమానపరిచే విధంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా కాస్త వివాదంలో చిక్కుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.