కరోనాతో... ప్రముఖ తెలుగు గాయకుడు మృతి
సీనియర్ సినీ గాయకుడు జి.ఆనంద్ (67) కరోనా బారిన పడి గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు. కరోనా చికిత్సలో భాగంగా సకాలంలో వెంటిలేటర్ లభించకపోవడంతో ఆనంద్ మృత్యువాత పడినట్లు తెలిసింది.
భారత దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా దెబ్బకు వేల సంఖ్యలో చనిపోయారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు.. దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. తాజాగా కోవిడ్ 19 వైరస్ మహమ్మారి ప్రముఖ సింగర్ జి. ఆనంద్ ని బలితీసుకుంది.
తెలుగు సినీ సంగీత ప్రపంచంలో మరో విషాదం నెలకొంది. సీనియర్ సినీ గాయకుడు జి.ఆనంద్ (67) కరోనా బారిన పడి గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు. కరోనా చికిత్సలో భాగంగా సకాలంలో వెంటిలేటర్ లభించకపోవడంతో ఆనంద్ మృత్యువాత పడినట్లు తెలిసింది. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
జి.ఆనంద్... ‘ఒక వేణువు వినిపిం చెను’ (అమెరికా అమ్మాయి), ‘దిక్కులు చూడకు రామయ్య.., ‘విఠలా విఠలా పాండురంగ విఠలా..’ వంటి సూపర్ హిట్ పాటలను ఆనంద్ పాడారు. కృష్ణ నటించిన ‘పండంటి కాపురం’, చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ తదితర చిత్రాల్లో కూడా ఆయన పాటలు పాడారు. ‘గాంధీనగర్ రెండో వీధి’, ‘స్వాతంత్య్రానికి ఊపిరి పోయండి’, ‘రంగవల్లి’ చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అలాగే కొన్ని సీరియల్స్, డబ్బింగ్ చిత్రాలకూ సంగీత సారథ్యం వహించారు.
జి ఆనంద్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగమ్ గ్రామం. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో కొనసాగుతున్నారు. స్వరమాధురి సంస్థ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించారు. ప్రస్తుతం సినీ గాయనీ గాయకులుగా ఉన్న పలువురిని ఈ సంస్థ ద్వారా ప్రోత్సహించారు.