తెలంగాణ వాదంతో `మా` ఎన్నికల బరిలో సీనియర్ నటులు సీవీఎల్ నర్సింహరావు..
`మా` ఎన్నికల్లో మరో కోణం వెలుగులోకి తీసుకొచ్చారు సీనియర్ నటులు సీవీఎల్ నర్సింహరావు. తాను కూడా `మా` అధ్యక్ష బరిలో దిగుతున్నట్టు ఓ వీడియో ద్వారా ఆదివారం ప్రకటించారు.
`మా` ఎన్నికల్లో మరో కోణం వెలుగులోకి తీసుకొచ్చారు సీనియర్ నటులు సీవీఎల్ నర్సింహరావు. తాను కూడా `మా` అధ్యక్ష బరిలో దిగుతున్నట్టు ఓ వీడియో ద్వారా ఆదివారం ప్రకటించారు. పొరుగు కళాకారులతో తెలుగు ఆర్టిస్టులకు జరుగుతున్న అన్యాయాలపై ఆయన మందుకొచ్చాడు. తెలంగాణ కళాకారులను జరుగుతున్న అన్యాయంపై తాను ప్రశ్నించారు. తెలంగాణ వాదంతో నటులు సీవీఎల్ నర్సింహరావు `మా` అధ్యక్ష బరిలో నిలవబోతున్నట్టు తెలిపారు.
ఈ సారి `మా` ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నర్సింహరావు రావడంతో ఐదుగురు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి `మా` ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. రోజు రోజుకు మారుతున్న పరిణామాలు మరింత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా సీనియర్ నటులు సీవీఎల్ నర్సింహరావు మాట్లాడుతూ, తాను తెలంగాణ వాదంతో, తెలంగాణ కళాకారుల ఇబ్బందులు, సమస్యలతో, అలాగే తెలంగాణతోపాటు ఏపీకి చెందిన చిన్న, పేద, మధ్య తరగతి కళాకారులకు జరుగుతున్న అన్యాయాలపై తాను ప్రశ్నంచబోతున్నట్టు తెలిపారు.
అందరికి సమన్యాయం జరిగేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ఏప్పుడో పదేళ్ల క్రితం పరభాషా నటులకు సంబంధించి ఓ నియమం పెట్టుకున్నారని, హీరోయిన్లని మినహాయిస్తే, నటుల విషయంలో సినిమాకి ఇద్దరు పరభాషా నటుల మాత్రమే ఉండాలని, అంతకు మించి ఉండకూడదని నిర్ణయించారని, కానీ ఇప్పుడు ఆ నియమాలను తుంగలోకి తొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. వీటి మూలంగా తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతుందన్నారు.
దీంతోపాటు `మా`లో ఏపీకి, తెలంగాణకి సపరేట్గా ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ సాహితీ అకాడమీ సపరేట్గా ఉంది. అధికార భాషా సంఘం సపరేట్గా ఉంది. రెండు ఎఫ్డీసీలున్నాయి. రెండు సినిమాటోగ్రఫీలున్నాయి. అలాగే తెలంగాణ `మా` కూడా ఉండాలన్నారు. 2009లో `మా` తెలంగాణ అని రిజిస్టర్ చేయించామని, కొన్ని ఆర్గనైజేషన్స్ ఏపీలో కూడా రిజిస్టర్ అయి ఉన్నాయని, కానీ కొంత మంది కుట్రల వల్ల దానికి ఏపీ అని పెట్టుకోవడానికి భయపడి, భంగపడి, ఇబ్బంది పడి, సిగ్గుపడి, దాన్ని తెలుగు చేసిన ధౌర్భాగ్యం వల్ల ఈ స్థితి వచ్చిందన్నారు.
అలాగే `మా`లో కూడా రెండు స్టేట్స్ కి సపరేట్గా ఉండాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. రెండింటికి ఎన్నికలు పెట్టాలని కోరారు. లేదా చర్చల ద్వారా మాట్లాడుకుని ఏం చేద్దామనేది నిర్ణయించాలని, దాని కోసం ఇప్పటి నుంచి పోరాడితే అవుతుందన్నారు. `మా`లో 18 మంది సభ్యుల్లో తొమ్మిది మంది తెలంగాణ వారిని, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్స్ లో ఒకటి తెలంగాణ వారికి, కార్యదర్శి, జాయింట్ సెక్రెటరీలో ఒకరు, అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లో ఒకరు తెలంగాణ వారు ఉండేలా అంగీకారం కుదిరితే, పునరాలోచన చేస్తానని తెలిపారు. ఎప్పుడు ఎక్కడ ఎవరినీ నొప్పించకుండా అన్నదమ్ముల వలే కలిసి ఉంటాం. కలిసి పనిచేస్తామని తెలిపారు.
ఈ కొత్త వాదనతో `మా` ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. నిజానికి తెలంగాణ ఏర్పడిన కొత్తలో తెలంగాణ కళాకారుల కోసం కొత్తగా పలు సంస్థలు ఏర్పడ్డాయి. కొన్ని రోజులు హడావుడి చేసి తర్వాత సైలెంట్ అయ్యారు. ఈ వాదంతో వారంతా ఇప్పుడు బయటకు వస్తారా? లేక ఈ వాదాన్ని ఆదిలోనే తొక్కేస్తారా? సీనియర్ నటులు సీవీఎల్ నర్సింహరావు వాదనని పట్టించుకుంటారా? లేదా? అన్నది చూడాలి. `మా` ఎన్నికలకు ఇంకా రెండు నెలలుంది.