ఈనెల 24న టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు (Chalapathi Rao) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఈ  కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు కాస్తా ఆలస్యంగా పూర్తయ్యాయి. ఈనెల 24న రాత్రి ఎనిమిది గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, స్టార్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికన నివాళులు అర్పించారు. ఆయనతో అనుబంధాన్ని పంచుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే, చలపతి రావు కన్నుమూసిన మూడు రోజుల తర్వాత అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కుమార్తెలు ఇద్దరు విదేశాల్లో ఉండటం మూలంగా.. ఇండియాకు చేరుకోవడం ఆలస్యం అయ్యింది. నిన్న రాత్రి వారు హైదరాబాద్ కు చేరారు. ముందుగానే కొడుకు రవిబాబు (Ravi Babu) తెలిపిన విధంగా ఈరోజు అంత్యక్రియలు చేశారు. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో విద్యుత్ దహన వాటిక వద్ద అంత్యక్రియలు ముగిశాయి. కార్యక్రమానికి నిర్మాతలు సురేష్ బాబు, దామొదర ప్రసాద్, బండ్ల గణేష్.. దర్శకులు శ్రీవాస్, బోయపాటి శ్రీను, బి గోపాల్.. హీరో మంచు మనోజ్, రఘు బాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు హాజరయ్యారు. 

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాద ఘటనలు సినీ లోకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇండస్ట్రీలోని సీనియర్ నటులు ఒక్కొక్కరు గా కన్నుమూస్తుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు, స్టార్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ సీనియర్ నటులు రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, ఐదు రోజుల కింద నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో రెండ్రోజుల కింద సినీయర్ నటుడు చలపతిరావు కూడా తుదిశ్వాస విడిచారు. దీంతో చిత్ర సీమలో విషాధ ఛాయలు నెలకొన్నాయి. 1966లో తెలుగు తెరకు పరిచయం చలపతి రావు 600కు పైగా చిత్రాల్లో నటించారు. కామెడీ, విలన్ పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరించి ప్రసిద్ధి చెందారు.