Satyaraj: సత్యరాజ్ కి ఆసుపత్రిలో కరోనా ట్రీట్మెంట్... తీవ్రత అధికం కావడంతో ఆందోళన!
నటుడు సత్యరాజ్ ఆరోగ్యానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ తీవ్రత ఎక్కువ కావడంతో ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది.
జనవరి 8 శనివారం నటుడు సత్యరాజ్ (Satyaraj) కరోనా బారినపడ్డారన్న సమాచారం బయటకు వచ్చింది. కరోనా కారణంగా ఇంట్లోనే క్వారంటైన్ కావడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా తీవ్రత అధికం కావడంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం సత్యరాజ్ కి కోవిడ్ ప్రభావం తగ్గలేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
సత్యరాజ్ ప్రస్తుత వయస్సు 67 ఏళ్ళు. ఆయన వయసు రీత్యా ఏమవుతుందోనన్న భయం నెలకొంది. సత్యరాజ్ లేటెస్ట్ హెల్త్ కండీషన్ పై సమాచారం అందాల్సి ఉంది. ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేయాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్యరాజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి కట్టప్పగా... దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్న సత్యరాజ్, ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ (Radhe Shyam)లో సైతం కీలక రోల్ చేశారు.
అలాగే దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. 2019లో విడుదలైన ప్రతిరోజూ పండగే మూవీలో సత్యరాజ్ కీలక రోల్ చేశారు. సాయి ధరమ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం భారీ విజయం అందుకుంది. ఇక సత్యరాజ్ త్వరగా కోలుకుని బయటికి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరోవైపు కరోనా (Corona virus) మహమ్మారి మరలా విజృంభిస్తుంది. రోజుల వ్యవధిలో టాలీవుడ్ కి చెందిన మంచు మనోజ్, మంచు లక్ష్మీ, మహేష్ బాబు (Mahesh Babu), బండ్ల గణేష్, థమన్, త్రిష కరోనా బారినపడ్డారు. ఇతర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకుతుంది. సామాన్య ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా నియమాలు పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి.