సాయిపల్లవి చిత్రం `అనుకోని అతిథి` నిర్మాత గుండెపోటుతో కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్(66) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తనకి గుండెపోటు రావడంతో గమనించి కుటుంబ సభ్యులు స్పందించే లోపే విశాఖలోని తన నివాసం ఆయన ప్రాణాలు వదిలారు. అన్నంరెడ్డి కృష్ణ కుమార్ `అనుకోని అతిథి` అనే సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇది మరో రెండు రోజుల్లో `ఆహా` ఓటీటీ విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో సాయిపల్లవి, ఫహాద్ ఫాజిల్ జంటగా నటించారు. మలయాళ చిత్రానికి డబ్బింగ్.
దీంతోపాటు తరుణ్ కథానాయకుడిగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో 'సఖియా నాతో రా' చిత్రాన్ని కృష్ణకుమార్ నిర్మించారు. అంతకుముందు 'ఈ పిల్లకి పెళ్ళవుతుందా', 'కలికాలం ఆడది', 'డామిట్ కథ అడ్డం తిరిగింది', 'ఈ దేశంలో ఒకరోజు' చిత్రాలు నిర్మించారు. దర్శకుడు మారుతితో కలిసి 'బెస్ట్ యాక్టర్స్' చిత్రాన్ని నిర్మించారు. మలయాళం సూపర్ హిట్ 'తన్నీర్ మతన్ దినంగల్'ను తెలుగులో రీమేక్ పనుల్లో ఉండగా... ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం దురదృష్టకరం.కృష్ణకుమార్ భార్య జ్యోతి కొన్నేళ్ళ క్రితం కాలం చేశారు. 'వంశ వృక్షం', 'తూర్పు వెళ్ళే రైలు', 'మరో మలుపు', 'మల్లె పందిరి' తదితర చిత్రాలలో ఆమె కథానాయికగా నటించారు. కృష్ణకుమార్, జ్యోతి దంపతులకు ఓ కుమార్తె ఉన్నారు.
నిర్మాత కృష్ణకుమార్ మృతిచెందడంతో చిత్రబృందంతోపాటు టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. కృష్ణకుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇటీవల గుండెపోటుతో ప్రముఖ పీఆర్వో, నిర్మాత బీ.ఏ.రాజు కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతకు ముందు టీఎన్ఆర్, గాయకుడు జి.ఆనంద్, స్టిల్ ఫోటో గ్రాఫర్ మోహన్ జీ, రచయిత నంద్యాల రవి వంటి ప్రముఖులు కన్నుమూశారు. ఇలా వరుసగా ప్రముఖుల మరణం టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్నినింపుతుంది.