`ఆర్ఆర్ఆర్` సంచలనం సృష్టించింది. `నాటు నాటు` పాటకిగానూ ఆస్కార్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `ఆర్ఆర్ఆర్` సీక్వెల్పై స్పందించారు విజయేంద్రప్రసాద్. క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
`ఆర్ఆర్ఆర్`కి ఆస్కార్ రావడం పట్ల రైటర్ విజయేంద్రప్రసాద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్స్ గర్వపడినట్టుగానే తాను గర్వపడుతున్నానని తెలిపారు. `ఆర్ఆర్ఆర్`తో ఆస్కార్ సాకారం చేసిన రాజమౌళికి ఫాదర్ అయినందుకు, ఆయన తనకు కుమారుడు అయినందుకు ఓ తండ్రిగా గర్వపడుతున్నానని, అత్యంత సంతోషకరమైన సందర్భం అని అన్నారు. ఆస్కార్ ప్రకటించే సమయంలో అందరిలాగే తాను ఎగ్జైట్ అయినట్టు చెప్పారు.
తాజాగా `ఆర్ఆర్ఆర్`లోని `నాటు నాటు` పాటకి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్ సినిమా చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా ప్రపంచానికి తెలిసేలా చేసింది `నాటు నాటు`. ఈ సినిమాకి పునాది వేశారు విజయేంద్రప్రసాద్. ఆయన మదిలో పుట్టిన కథే `ఆర్ఆర్ఆర్` అనే విషయం తెలిసిందే. ఆస్కార్ వచ్చినప్పుడు తాను ఎంతో హ్యాపీగా ఫీలైనట్టు చెప్పారు. తాజాగా ఆయనతో `ఏషియానెట్ తెలుగు` ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్బంగా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆస్కార్ తనపై బాధ్యత పెంచిందన్నారు. మున్ముందు మరిన్ని మంచి కథలు రాసేందుకు ప్రోత్సాన్నిచ్చిందన్నారు. రచయితని గౌరవిస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయన్నారు.
ఇందులో `ఆర్ఆర్ఆర్` సీక్వెల్పై స్పందించారు విజయేంద్రప్రసాద్. `ఆర్ఆర్ఆర్` అభిమానులకు క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఇంతకు మించి `ఆర్ఆర్ఆర్2` ఉండబోతుందన్నారు. ఇదే కథకి కొనసాగింపుగా కథ ఉంటుంది, ఎన్టీఆర్, రామ్చరణ్ నటిస్తారని వెల్లడించారు. ఇదే కాంబినేషన్లో సినిమా చేయబోతున్నామని, ఆ వివరాలు మున్ముందు వెల్లడిస్తామని తెలిపారు. ఇంతకు మించి దీనిపై ఇప్పుడు తాను స్పందించలేనన్నారు.
ఈ సందర్భంగా మహేష్బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా గురించి చెప్పారు. భారీ బడ్జెట్తో, భారీ స్కేల్లో అంతర్జాతీయంగా ఈ సినిమా ఉంటుందన్నారు. అయితే అంతర్జాతీయంగా అంటే అదేదో కాదని, మనవైన ఎమోషన్స్, మనవైన కథలే ఉంటాయన్నారు. `ఆర్ఆర్ఆర్` లో అంతర్జాతీయ అంశాలేవి లేవని, కథ బాగుండాలని, కథ బాగుంటే చూస్తారని, ఆ కథ, ఆ ఎమోషన్ నచ్చిందని, హృదయాన్ని హత్తుకుందని, అందుకే ఇంతగా ఆదరించారని, దానికి భాషతో సంబంధం లేదన్నారు. ప్రస్తుతం మహేష్బాబు సినిమా వర్క్ జరుగుతుందన్నారు.
