సీబీఐ దర్యాప్తు పూర్తి చట్ట విరుద్ధమంటున్న రియా చక్రవర్తి
సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సీబీఐని తప్పుపట్టింది. సుశాంత్ కేసుని సీబీఐ చట్టవిరుద్ధంగా దర్యాప్తు చేస్తుందని ఆరోపించింది. ఇది ఫెడరల్ వాదానికి వ్యతిరేకమని వెల్లడించింది.
సుశాంత్సింగ్ రాజ్పుత్ కేసులో తనపై గురువారం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై స్పందించిన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సీబీఐని తప్పుపట్టింది. సుశాంత్ కేసుని సీబీఐ చట్టవిరుద్ధంగా దర్యాప్తు చేస్తుందని ఆరోపించింది. ఇది ఫెడరల్ వాదానికి వ్యతిరేకమని వెల్లడించింది. తమపై పాట్నాలో దాఖలైన కేసుని ముంబయికి బదిలీ చేయాలని కోరిన ఆమె ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు సీబీఐ ఈ కేసు విచారణకు దూరంగా ఉండాలని గురువారం వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సహా ఆమె తల్లిదండ్రులు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, సోదరుడు షోయిక్ చక్రవర్తితోపాటు శామ్యూల్ మిరంద, శ్రుతి మోదీ అనే మరో ఇద్దరిపై సీబీఐ అధికారులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు బిహార్ పోలీసులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
తన కొడుకు మృతికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి గత నెలలో పాట్నా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిఫార్సు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ముందునుంచి ముంబయి పోలీసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ కేసుని విచారించేందుకు వచ్చిన బీహార్ ఎస్పీని ముంబయి పోలీసులు నిర్భంధించారు.
సుశాంత్ జూన్ 14న బాంద్రాలోని తన అపార్ట్ మెంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతుంది. ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యం, కొత్త విషయాలు వెల్లడవుతున్న నేపథ్యంలో పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన దాదాపు నలభై మందిని పోలీసులు విచారించారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ, సుశాంత్ ముంబయిలో మరణించడంతో మహారాష్ట్ర పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేయాలి. ఇందులో బీహార్ పోలీసులకు సంబంధం లేదన్నారు. బీహార్ ప్రభుత్వం దర్యాప్తు చేయడానికి అధికార పరిధి లేదన్నారు. కాబట్టి ఈ కేసుని ముంబయి పోలీసులకు దర్యాప్తు చేయాలన్నారు. సీబీఐని మహారాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ విచారించడానికి అనుమతి ఉండదన్నారు. దీనిపై ఆమె సుప్రీంకోర్ట్ కి వెళ్ళారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, సుప్రీంకోర్ట్ ముంబయి, బీహార్ పోలీసుల దర్యాప్తు ప్రతిని తమకి సమర్పించాలని కోరిందని, సీబీఐ నమోదు చేసిన కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. బీహార్ ప్రభుత్వం త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ కేసుని రాజకీయంగా వాడుకోవాలనుకుంటుందన్నారు. అందుకే కేసు విషయంలో ఒత్తిడి తెస్తుందన్నారు.
మరోవైపు సుశాంత్ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. సుశాంత్ ఖాతాల నుంచి రియా చక్రవర్తికి రూ. 15 కోట్లు బదిలీ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆ దిశగా ఆరా తీస్తోంది. ఈనెల 7న తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది.